Devotional

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు.

తిరుమల  శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ సెల్ల‌దొరై, విల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మ‌న్ ర‌విచంద్ర‌న్ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఈవో ముత్తురాజ‌, ఆల‌య స్థానాచార్యులు ర‌మేష్ స్వామి, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.