Politics

కొండగట్టు, ధర్మపురి దర్శించనున్న పవన్ కళ్యాణ్

కొండగట్టు, ధర్మపురి  దర్శించనున్న  పవన్ కళ్యాణ్

ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు దర్శించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* వారాహికి సంప్రదాయ పూజ
ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో
‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు.
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి
ప్రమాదానికి గురికాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు శ్రీ పవన్ కళ్యాణ్
గారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి
ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని
ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య
నాయకులతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే
కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం) ను ప్రారంభించాలని శ్రీ పవన్ కళ్యాణ్
గారు సంకల్పించారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ
క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.