NRI-NRT

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

టెక్సాస్ రాష్ట్రం ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పుల కలకలం,కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు,మరో ఏడుగురికి గాయాలు,పోలీసు ఎదురు కాల్పుల్లో నిందితుడి మృతి.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రం ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ పరిసరాల్లో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపి మట్టుపెట్టాడు. నిందితుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. గాయపడ్డవారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు నగర పోలీస్ చీఫ్ బ్రయన్ హార్వీ ప్రకటించారు.

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తరువాత ఇదే అత్యధికమని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా 2020లో 45 వేల మంది అసువులు బాసారు.

ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్.. ఇది మాటలకు అందని విషాదమని వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులకు, బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.