Food

పచ్చిగుడ్లను తాగితే లాభమా.. నష్టమా..?

పచ్చిగుడ్లను తాగితే లాభమా.. నష్టమా..?

పచ్చిగుడ్లను గిలకొట్టి వాటిలోని పానీయాన్ని తాగితే బలం వస్తుందని కొందరు నమ్ముతుంటారు. పాలల్లో వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఇంకొందరు భావిస్తుంటారు. మరికొందరు కేవలం వీటిలోని తెల్లసొనను తీసి తాగుతుంటారు. ముఖ్యంగా బాడీబిల్డర్లు, కండరాలు పెంచాలని భావించేవారు ఇలా చేస్తుంటారు. అయితే ఎగ్స్‌వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కారణంగా ఇవి పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌గానూ, పోషకాహారంగానూ ఉంటున్నాయి. కానీ పచ్చిగుడ్లు మాత్రం ప్రమాదకరం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎందుకంటే వీటిలోని తెల్లసొన కారణంగా సాల్మొనెల్లా(salmonella) అనే వ్యాధికి దారితీస్తుంది. ఇది పేగులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా. క్రమంగా జీర్ణక్రియ మందగించడంతోపాటు ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది. అందుకే ఉడకబెట్టిన, ఆమ్లెట్ వేసిన, కూరలుగా వండిన ఎగ్స్‌ను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

పచ్చి గుడ్లను తీసుకోవడంవల్ల శరీంలో బయోటిన్ లోపం కూడా ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా తెల్లసొనలో అవిడిన్(avidin)అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరం బయోటిన్‌ను, బి-విటమిన్‌ను గ్రహించకుండా నిరోధిస్తుంది. కొన్ని వారాలు లేదా నెలల వరకు పచ్చి గుడ్డును తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇందులోని హై లెవెల్ అవిడిన్ ప్రోటీన్ బయోటిన్‌ను అడ్డుకుంటుంది. బయోటిన్ లోపం కారణంగా న్యూట్రిషన్ డిజార్డర్స్ తలెత్తుతాయి.

రా ఎగ్స్‌ను ఏ రూపంలో తీసుకున్నా కొంత కాలం తర్వాత దురద, దద్దుర్లు లేదా తామర వంటి చర్మ సమ్యలు తలెత్తుతాయి. దీంతోపాటు ముక్కు కారడం, తరచూ తుమ్ములు, దగ్గు, గురక లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలతోపాటు జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అరుదుగా అనాఫిలాక్సిస్, తీవ్రమైన అలెర్జీ, రక్తపోటు తగ్గడం, పల్స్ రేట్ పెరగడం, మైకం లేదా మూర్ఛ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే పచ్చిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోవద్దని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఉడకబెట్టిగానీ, ఆమ్లెట్ వేసుకోవడం ద్వారాగానీ, కూరలుగా వండటం ద్వారాగానీ తీసుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.