NRI-NRT

ఎన్‌ఆర్‌ఐలు స్థిరాస్తిని విక్రయించేటప్పుడు జాగ్రత్త అంటున్న నిపుణులు

ఎన్‌ఆర్‌ఐలు స్థిరాస్తిని  విక్రయించేటప్పుడు  జాగ్రత్త అంటున్న నిపుణులు

భారత్‌లో ఎన్నారైలు తమ స్థిరాస్తులు అమ్మే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతారు. ఆదాయపు పన్ను నిబంధనలపై పూర్తి అవగాహనతో ట్యాక్స్ భారం నుంచి కొంత మేర ఉపశమనం పొందొచ్చని సూచిస్తున్నారు(Tax rules for NRIs).ఎన్నారై తన స్థిరాస్తిని కొన్న రెండేళ్ల లోపు విక్రయిస్తే షార్ట్‌ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్లు దాటాకా అమ్మేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నారై ఆదాయం, ఆస్థి కొనుగోలకు అయిన ఖర్చు, ఆస్తి నిర్వహణకు అయిన ఖర్చులు, బదిలీ ఖర్చులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కిస్తారు.ఆస్తి అమ్మే సమయంలో ఎన్నారైలు టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయులకు టీడీఎస్ 1 శాతం కాగా, ఎన్నారైలు తమ ఆస్తులను రెండేళ్ల లోపు అమ్మేస్తే 30 శాతం టీడీఎస్ చెల్లించాలి. రెండేళ్ల తరువాత జరిపే అమ్మకాల్లో 20 శాతం చొప్పున టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. స్థిరాస్తి అమ్మకం విలువ ఆధారంగా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నులను పరిగణనలోకి తీసుకుంటూ దీన్ని లెక్కిస్తారు.

స్థిరాస్తి విక్రయించేటప్పుడు పన్ను భారం తగ్గించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు(NRI Tax saving options). స్థిరాస్తి అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెండు మూడేళ్ల లోపు మరో స్థిరాస్తి కొనుగోలుకు పెట్టుబడి పెడితే లాభాలపై పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చని చెబుతున్నారు. అయితే, ఈ సౌలభ్యానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, నిపుణులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. తద్వారా, పన్ను భారం నుంచి చాలా వరకూ ఉపశమనం పొందొచ్చని సలహా ఇస్తున్నారు.