Business

3 నుంచి తెలంగాణలో టీచర్ల బదిలీల ప్రక్రియ

3 నుంచి తెలంగాణలో టీచర్ల బదిలీల ప్రక్రియ

తెలంగాణలో సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పారదర్శకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అక్టోబరు 3లోపు టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం లేదా శనివారం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది.

కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా ఆగిన ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బదిలీలను కొనసాగించడానికి అనుమతించింది. సమర్థనీయమైన పాలనలో భాగంగా తెలంగాణ విద్యాచట్టంలోని సెక్షన్‌ 78 (2) ప్రకారం బదిలీలతోపాటు పదోన్నతులిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. బదిలీల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనంగా 10 పాయింట్లు కేటాయించడానికి సమర్థనీయ కారణం కనిపించలేదని పేర్కొంది. దంపతులను మాత్రం కలిసి ఉండనివ్వాలని, వారికి సంబంధించిన నిబంధనలో జోక్యం చేసుకోవడంలేదని హైకోర్టు తెలిపింది. అన్ని బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. నిబంధనల చెల్లుబాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేసింది.