Politics

సెన్సార్‌ బోర్డుకు లోకేష్‌ లేఖ

సెన్సార్‌ బోర్డుకు లోకేష్‌ లేఖ

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వ్యూహం’ చిత్రం ఎలాంటి సంచనలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రాజకీయాలు ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి. ఇక ఈ సినిమాను టీడీపీని, చంద్రబాబును కించపరిచేలా చిత్రీకరించినట్లు ఇప్పటికే టీడీపీ నుంచి అభ్యంతరలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే వ్యూహం చిత్రాన్ని నవంబర్‌ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్‌ కోరారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఆరు పేజీలతో కూడిన లేఖలో లోకేషన్‌ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. సెన్సార్‌ బోర్డ్‌కు రాసిన లేఖలో లోకేష్‌.. సీఎం జగన్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుందని, ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో రాంగోపాల్ వర్మ ఆయనపై వ్యూహం చిత్రాన్ని తీస్తున్నారని తెలిపారు.

ఇక ఈ సినిమాలో చంద్రబాబుతో పాటు తనను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, ఇవి పరువు నష్టం దావా కిందకు వస్తాయని లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు. సినిమా ట్రైలర్‌ విడుదలైన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, తన తండ్రి జైల్లో ఉన్నారని ఆ కారణంగానే ట్రైలర్‌లో సదరు సన్నివేశాలు ఉన్నట్లు తమకు తెలియలేదని లోకేష్‌ లేఖలో ప్రస్తావించారు. వ్యూహం సినిమా ట్రైలర్‌, దర్శకుడు, నిర్మాత మాట్లాడిన మాటల ఆధారంగా ఫిర్యాదు చేస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు.

చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకూడదని లోకేషన్‌ తెలిపారు. జగన్ తనను తాను ఓ గొప్ప వ్యక్తిగా చిత్రీకరింపజేసుకోవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్‌ ఆరోపించారు. ఇక స్కిల్ కేసు విషయాన్ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించారని, ఇది విచారణపై ప్రభావం చూపుతుందన్న లోకేష్‌.. కాబట్టి సెన్సార్‌ బోర్డ్ నిబంధనల ప్రకారం ఈ చిత్రానికి అనుమతి నిరాకరించాల్సిందిగా లోకేష్‌ సెన్సార్‌ బోర్డ్‌ను కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z