Devotional

తిరుచానూరు దేవాలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు దేవాలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుక నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు ఎక్కువమంది దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారన్నారు. 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు రూ.9కోట్లతో పుష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌, గుంటూరుకు చెందిన స్వర్ణకుమార్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పరదాలను అందజేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z