Sports

‘ఆంధ్రా క్రీడలు’లో వాలంటీర్లకు కీలక బాధ్యతలు

‘ఆంధ్రా క్రీడలు’లో వాలంటీర్లకు కీలక బాధ్యతలు

ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’(Aadudam Andhra) క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లను వీటి నిర్వహణలోనూ అన్ని రకాలుగా భాగస్వాములను చేయనున్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీల కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంచడం, క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ అన్నీ వారితోనే చేయిస్తున్నారు. క్రీడల్లో ప్రధానమైన అంపైరింగ్‌లోనూ వారినే వినియోగించనుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోటీలకు సంబంధించి మొదటి దశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో జరిగే క్రికెట్‌, ఖో-ఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ పోటీలకు వాలంటీర్లే అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

వ్యాయామ ఉపాధ్యాయుల కొరతతో.. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాప్‌లో శిక్షకుల భర్తీ చేపట్టలేదు. పాఠశాల, కళాశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఖాళీలను సైతం భర్తీ చేయకపోవడంతో జిల్లాలో వారి కొరత ఏర్పడింది. విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యాయామ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులున్నా వారి సేవలను వినియోగించుకోవడం లేదు. వాలంటీర్లతోనే క్రీడల నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఎంపిక చేసిన వాలంటీర్లకు మండల కేంద్రాల్లో రెండ్రోజుల పాటు శిక్షణ ఇచ్చి, ఐదు క్రీడాంశాలకు సంబంధించిన నియమ నిబంధనల పుస్తకాలను ఇటీవల అందజేశారు. మొత్తానికి వాలంటీర్లే అన్నీ తామై సచివాలయాల స్థాయిలో ‘ఆడుదాం.. ఆంధ్ర’ పోటీలను మొదలుపెట్టనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z