Politics

కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ లేఖ

కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ లేఖ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఇలాంటి క్రమంలో మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతో లేఖ విడుదల కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణలో దశాబ్దకాలం పాటు కొనసాగిన నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికారు అని పేర్కొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై నమ్మకంతో కాదు.. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని రాసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, ఎమర్జెన్సీ విధించి దేశాన్ని అల్లకల్లోలం సృష్టించిన విషయం ప్రజలు మరిచి పోలేదని మరోసారి పాత అంశాలను గుర్తు చేస్తూ లేఖను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా అమలు చేస్తుంది అని ప్రశ్నను పొందుపరిచారు.

ఇప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మహాలక్ష్మి, రైతు బరోసా, గృహ జ్యోతి, యువ వికాసం, చేయూత లాంటి ఆరు గ్యారంటీ లకు నిధులు ఎలా సమకూర్చుతారు అని నిలదీస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు. నిత్యవసరాల ధరలు పెంచి, పన్నులు పెంచితే ప్రజలు సహించరు అని లేఖ ద్వారా హెచ్చరించారు. అలాగే ఆదివాసీల చట్టాలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హరిత హారం వెంటనే రద్దు చేసి ఆదివాసీలపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవీ చట్టం ప్రకారం లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z