Devotional

శ్రీశైలం నడక భక్తుల నుండి డబ్బుల వసూలు

శ్రీశైలం నడక భక్తుల నుండి డబ్బుల వసూలు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలమంది భక్తులు నడక దారిలో వస్తుంటారు. అటవీ మార్గంలో 40 కి.మీ. నడిచి శ్రీశైలం చేరుకుంటారు. ఎప్పుడూ లేనిది ఈసారి పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరిట అటవీ అధికారులు భక్తులు ఒక్కొక్కరి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నారు. కన్నడ భక్త బృందం శుక్రవారం కాలినడకన వెళ్తుండగా డబ్బు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో వారు నిరసనకు దిగారు. అడవిలో గంటకు పైగా ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు డబ్బులు చెల్లించారు. దీనిపై అటవీ సిబ్బందిని వివరణ కోరగా.. అడవి మార్గంలో పాదచారులు పారేసే ప్లాస్టిక్‌, ఇతర చెత్తను శుభ్రం చేయడానికి సిబ్బంది, కూలీల ఖర్చుల నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డబ్బులు వసూలు చేస్తున్నామని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z