NRI-NRT

కిడ్నాప్ కేసులో ప్రవాస ప్రముఖులు

కిడ్నాప్ కేసులో ప్రవాస ప్రముఖులు

జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి.. బలవంతంగా షేర్ల బదాలయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ యర్నేని పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆయన ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌తోపాటు పలువురిపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ఆర్‌ఐ, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించి.. ట్యాపింగ్‌ కేసులోని పలువురు నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాధాకిషన్‌రావు, గట్టుమల్లు, మల్లికార్జున్‌తోపాటు కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ, చంద్రశేఖర్‌ వేగేతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు వేణుమాధవ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్‌ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్‌ యర్నేని, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో డైరెక్టర్లకూ నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వేణుమాధవ్‌, చంద్రశేఖర్‌ వేగేల మధ్య ఆర్థికపరమైన విభేదాలతో ఇరువురిపై కేసులు నమోదై ఉన్నాయి. చంద్రశేఖర్‌ మీద గతంలో పీడీ చట్టాన్ని సైతం ప్రయోగించగా విచారణ క్రమంలో దానిని అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z