Politics

మరో 38 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల-NewsRoundup-Apr 22 2024

మరో 38 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల-NewsRoundup-Apr 22 2024

* సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) అధికార భారతీయ జనతా (BJP) పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌ (Surat) స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్‌ విజయానికి మార్గం సుగమమైంది.

* పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు.. వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

* ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కొన్ని జట్లు ఒక్క టైటిల్‌నూ నెగ్గలేదు. ఆ జాబితాలో బెంగళూరు, పంజాబ్, దిల్లీ ఉన్నాయి. కొత్తగా వచ్చిన లఖ్‌నవూ కూడా సాధించలేదు. ముంబయి, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. స్టార్‌ క్రికెటర్లు ఉన్నా పైనాలుగు జట్లకు టైటిల్ కల మాత్రం నెరవేరలేదు. దీనికి కారణం ఏంటనే దానిపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైనా చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

* మాల్దీవుల (Maldives) పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (PNC) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 70 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ముయిజ్జకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి.

* అక్టోబరు 7నాటి హమాస్‌ దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత సమర్థమంతమైనవిగా గుర్తింపుపొందిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు.. హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. దీనిపై భద్రతా అధికారులు క్షమాపణలు సైతం చెప్పారు. ఈ క్రమంలోనే నాటి ఇంటెలిజెన్స్‌ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా రాజీనామా చేశారు. హమాస్‌ దాడుల వ్యవహారంలో రాజీనామా చేసిన మొదటి సీనియర్ సైనికాధికారి ఆయనే.

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) విమర్శలు గుప్పించారు. నవభారత నిర్మాణం కోసం మాజీ ప్రధానులు కృషి చేస్తే.. ప్రధాని మోదీ మాత్రం ఇతరులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా అమరావతిలో ఏర్పాటుచేసిన ప్రచారంలో పాల్గొన్న శరద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మాజీ ప్రధానులైన జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్ నవ భారతాన్ని నిర్మించేందుకు ఎంతో కృషి చేశారు. నెహ్రూ చేసిన కృషి చరిత్ర పుటలో నిలిచింది. అది ఎవరూ మరచిపోలేరు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ఇతరులను విమర్శిస్తున్నారు. గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పడం లేదు’’ అని ఆరోపించారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చడం గురించి కొందరు భాజపా నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ప్రధాని ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీరును అనుకరిస్తున్నారు. భారత్‌లో మరో పుతిన్‌ తయారవుతున్నారు. ఇది ఆందోళనకరం. దేశంలో నిరంకుశ పాలనను మీరంతా అనుమతించొద్దు’’ అని ప్రజలను కోరారు.

* దేశంలోని వనరులపై మైనారిటీలకే మొదటి హక్కు అని కాంగ్రెస్ అంటే పేదలు, ఆదివాసీలు, దళితులకే ఆ హక్కు చెందుతుందని భాజపా విశ్వసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ‘‘దేశంలోని వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కాని వాటిపై పేదలు, ఆదివాసీలు, దళితులు, వెనకబడినవారికి మొదటి హక్కు ఉందని మేము అంటున్నాము. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించింది. నక్సలిజం అంతరించిపోయే దశలో ఉంది. దేశవ్యాప్తంగా 123 మంది నక్సలైట్లను అరెస్టు చేశాం. మరో 250 మంది లొంగిపోయారు. వచ్చే రెండేళ్లలో మిగిలినవారు కూడా లొంగిపోవడానికి అవకాశమిస్తాం, లేదంటే వారిని కూడా అదుపులోకి తీసుకుంటాము’’ అని షా తెలిపారు. మూడోసారి మోదీని గెలిపిస్తే రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ప్రజలకు వివరించారు.

* సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదన్నారు. నిజామాబాద్‌లోనే బోర్డు ఏర్పాటు అని స్పష్టంగా చెప్పకుండా నోట్‌ విడుదల చేశారని విమర్శించారు.

* ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. గతంలో 114 స్థానాలకు వెల్లడించగా.. తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
బొబ్బిలి- మరిపి విద్యాసాగర్‌
గజపతినగరం- దోలా శ్రీనివాస్‌ (కురిమినాయుడు స్థానంలో)
నెల్లిమర్ల – ఎస్‌.రమేశ్‌కుమార్‌
విశాఖపట్నం ఉత్తరం – లక్కరాజు రామారావు
చోడవరం – జగత్‌ శ్రీనివాస్‌
యలమంచిలి – టి.నర్సింగ్‌ రావు
పి.గన్నవరం (ఎస్సీ) – కె.చిట్టిబాబు
ఆచంట – నెక్కంటి వెంకట సత్యనారాయణ
విజయవాడ (ఈస్ట్‌) – సుంకర పద్మశ్రీ
జగ్గయ్యపేట – కర్నాటి అప్పారావు
తాడికొండ (ఎస్సీ) – మణిచల సుశీల్‌ రాజా (చిలకా విజయ్‌ కుమార్‌ స్థానంలో..)
రేపల్లె – మోపిదేవి శ్రీనివాసరావు
తెనాలి – ఎస్‌కే బషీద్‌
గుంటూరు వెస్ట్‌ – డాక్టర్‌. రాచకొండ జాన్‌ బాబు
చీరాల – ఆమంచి కృష్ణమోహన్‌
ఒంగోలు – తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
కనిగిరి – దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
కావలి – పొదలకూరి కల్యాణ్‌
కోవూరు – నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్‌ స్థానంలో)
సర్వేపల్లి – పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్‌ స్థానంలో)
గూడురు (ఎస్సీ) డాక్టర్‌. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
వెంకటగిరి – పి.శ్రీనివాసులు
కడప- తుమ్మన్‌ కల్యాల్‌ అస్జల్‌ అలీఖాన్‌
పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్‌ రెడ్డి
జమ్మలమడుగు – బ్రహ్మానందరెడ్డి పాముల
ప్రొద్దుటూరు – షేక్‌ పూల మహ్మద్‌ నజీర్‌
మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్‌
శ్రీశైలం- అసర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌
బనగానపల్లె – గూటం పుల్లయ్య
డోన్‌ – గారపాటి మధులెట్టి స్వామి
ఆదోని – గొల్ల రమేశ్‌
ఆలూరు – నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల
కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
హిందూపురం – మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ

* దిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్‌ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు.

* తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

* సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాతా తెరించింది. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్‌ విజయానికి మార్గం సుగమమైంది.

* ప్రముఖ టెక్ సంస్థ మెటా ఇటీవల లామా-3 ఏఐ మోడల్స్‌ను విడుదల చేసింది. వాటిని వాట్సప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానం చేసింది. ఈసందర్భంగా భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) పనితీరును నిర్దేశించబోయే అంశమేంటో సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అది డేటా మాత్రం కాదని స్పష్టంచేశారు.

* ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) పేరే వినిపిస్తోంది. ఇందులో అమితాబ్‌ పాత్రను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాన్ని విడుదల చేయడం ఒక కారణమైతే ఈ ప్రాజెక్ట్‌లో మరికొందరు యంగ్‌ నటీనటులు భాగం కానున్నారని వస్తోన్న వార్తలు మరో కారణం. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో ఇప్పటికే అగ్ర తారలు భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.

* ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సైదాబాద్‌ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవీని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

* దేశంలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఇవి జరుగుతుండగా.. ఇప్పటికే మొదటి విడత పూర్తయ్యింది. అయితే, ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి మండుటెండల్లో క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈనేపథ్యంలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు (Tamil Nadu) అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z