Business

జొమాటొ ధర పెంపు-BusinessNews-Apr 22 2024

జొమాటొ ధర పెంపు-BusinessNews-Apr 22 2024

* ప్రముఖ ఫుడ్‌డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమటో (Zomato) ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.5 చొప్పున దీనిని వసూలు చేయనుంది. ఏప్రిల్‌ 20 నుంచే పెరిగిన ఫీజు అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంతం, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, లఖ్‌నవూ వంటి ప్రధాన మార్కెట్లలో ఇప్పటికే యూజర్ల నుంచి దీనిని వసూలు చేస్తోంది. మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఇప్పటికే ఒక్కో డెలివరీకి రూ.5 చొప్పున వసూలు చేస్తోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ రాణించాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, ఇన్‌ఫ్రా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో సూచీలు వరుసగా రెండోరోజూ రాణించాయి. సెన్సెక్స్‌ 560 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,300 పాయింట్ల ఎగువన ముగిసింది.

* ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (FSD)’ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది. 12,000 డాలర్ల నుంచి 8,000 డాలర్లకు కుదించింది. కార్లపైనా కంపెనీ 2,000 డాలర్ల వరకు ధరల్ని తగ్గించిన విషయం తెలిసిందే. చైనా మార్కెట్‌కూ ఆ నిర్ణయాన్ని వర్తింపజేసింది. ఇలా వరుసగా ధరలు తగ్గించటం.. ఇతర కంపెనీల నుంచి టెస్లా ఎదుర్కొంటున్న పోటీని సూచిస్తోందని వాహనరంగ నిపుణులు తెలిపారు.

* ప్రముఖ టెక్ సంస్థ మెటా ఇటీవల లామా-3 ఏఐ మోడల్స్‌ను విడుదల చేసింది. వాటిని వాట్సప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానం చేసింది. ఈసందర్భంగా భవిష్యత్తులో కృత్రిమ మేధ (Artificial Intelligence-AI) పనితీరును నిర్దేశించబోయే అంశమేంటో సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అది డేటా మాత్రం కాదని స్పష్టంచేశారు. ‘‘ఏఐ మోడల్‌లో డేటా కంటే ఫీడ్‌బ్యాక్‌ లూప్‌లు చాలా విలువైనవిగా మారతాయని నా నమ్మకం’’ అని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) వెల్లడించారు. ఏఐ మోడల్స్‌ను ట్రైన్‌ చేయడం, మెరుగుపర్చడం కోసం ఫీడ్‌బ్యాక్ లూప్‌లను ఉపయోగిస్తారు. ఇవి గత ఔట్‌పుట్‌ల ఆధారంగా పని చేస్తాయి. తప్పులు జరుగుతున్న సమయంలో ఏఐ మోడల్స్‌కు వాటిని గుర్తు చేసి, అవగాహన కల్పించే అల్గారిథమ్‌లనే లూప్స్‌గా వ్యవహరిస్తారు. పనితీరును మెరుగు పర్చుకోవడానికి కావాల్సిన డేటాను కూడా అవి అందిస్తాయి. ఏఐ మోడల్స్‌ను ఉపయోగించడం, వాటిలోని లోపాలను గుర్తించడం, ఫీడ్‌బ్యాక్‌ రూపంలో వాటిని అందించి మెరుగుపర్చడమనే ప్రక్రియ భవిష్యత్తులో చాలా విలువైనదిగా మారుతుందని జుకర్‌బర్గ్‌ వివరించారు.

* భారత్‌కు చెందిన ప్రముఖ మసాల దినుసుల తయారీ సంస్థలు ఎండీహెచ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల దినుసుల్ని తమ దేశంలో నిషేధిస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రకటించింది. గత వారం సింగపూర్‌ ప్రభుత్వం ఎవరెస్ట్‌ మసాల దినుసుల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. సదరు సంస్థపై చర్యలకు ఉపక్రమించింది. తాజాగా హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేప్టీ (సీఎస్‌ఎఫ్‌)అథారిటీ విభాగం ఏప్రిల్‌ 5న నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఎండీహెచ్‌ గ్రూప్‌ తయారు చేసిన మసాల దినుసులైన మద్రాస్‌ కర్రీ ఫౌడర్‌, సాంబార్‌ మసాల్‌ ఫౌండర్‌, కర్రీ ఫౌడర్‌లలో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ గుర్తించామని అధికారికంగా ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z