🕑 Published: June 10, 2026 at 06:46 PM CST
మంచిర్యాల నగరంలోని నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన లగిశెట్టి స్పందన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మే 31న ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారంతా స్పందన తల్లిదండ్రుల దీన స్థితిని తెలుసుకుని స్పందించారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) అధ్యక్షుడు చల్లా జయంత్, ఆటా చికాగో సేవక్ ఇన్ఛార్జి మహిపాల్లు బుధవారం ఉదయం స్పందన చికిత్స పొందుతున్న పార్క్ రిడ్జ్లోని అడ్వొకేట్ లూథరన్ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు.
ఆమెకు అయ్యే రూ.3,81,26,260(నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు) వైద్య ఖర్చులను తెలుగు అసోసియేషన్ విరాళాల ద్వారా సేకరించి అందించనున్నట్లు వారు స్పష్టం చేశారు. స్పందన తల్లిదండ్రులను కలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాచకొండ వెంకటేశ్వర్రావు, పదో వార్డు కార్పొరేటర్ రాచకొండ గోపాల్రావు, ఆర్అండ్బీ విశ్రాంత ఎస్ఈ వేణు మాధవరావులు అమెరికాలో నివసిస్తున్న ఆటా అధ్యక్షుడు జయంత్తో ఫోన్లో మాట్లాడారు. స్పందన తల్లిదండ్రుల పరిస్థితిని వివరించారు. ఆయన అక్కడి తెలుగు అసోసియేషన్ నాయకులు, సభ్యులతో మాట్లాడి చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం నిధులు సేకరించాలని నిర్ణయించినట్లు వివరించారు. గోఫండ్ రైజర్ అనే యాప్ ద్వారా ‘ఫండ్ మీ’ పేరిట స్పందన కోసం ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టగా బుధవారం నాటికి రూ.2,55,28,046 (2,67,832 యూఎస్ డాలర్లు) జమయ్యాయి. స్పందన తల్లిదండ్రులు అమెరికా వెళ్లడానికి వీసా ఇప్పించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు.
