🕑 Published: June 06, 2026 at 05:15 AM CST
APTS ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ విజేతలకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేసిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ.
ఇటీవల APTS ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అందచేశారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ కు ఎంపిక అయిన ప్రతి అభ్యర్థికి ప్రతి నెల రూ.10,000 స్టైఫండ్ ఇవ్వటంతో పాటు సైబర్ సెక్యూరిటీ భద్రతా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో APTS M.D మల్లవరపు సూర్య తేజ పాల్గొన్నారు. మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో APTS రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ను నిర్వహించిందన్నారు. ఈ హ్యాకథాన్ పరీక్షకు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు, వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మన్నవ మోహన కృష్ణ గారు మరియు మల్లవరపు సూర్య తేజ సర్టిఫికేట్లు అందజేశారు. రాష్ట్రంలో డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు సైబర్ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అత్యాధునిక సాంకేతిక సేవలను అందించడంలో APTS కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, అప్లికేషన్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు, ఆధార్ వాలిడేషన్, ఈ-ప్రొక్యూర్మెంట్ తదితర సేవలను సంస్థ సమర్థవంతంగా అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను సైబర్ మోసాల నుంచి రక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిషింగ్ దాడులు, హ్యాకింగ్, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సైబర్ భద్రతపై చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక “సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్” ద్వారా ప్రభుత్వ డేటా సెంటర్లు, కార్యాలయాలు, ఐటీ మౌలిక వసతులను 24 గంటలూ, ఏడాది పొడవునా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. AP-CERT ఆధ్వర్యంలో 3,000కు పైగా ఐటీ ఆస్తులు మరియు ప్రభుత్వ ఐటీ మౌలిక సదుపాయాలపై నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. ప్రారంభంలో 12,500 ఈవెంట్స్ పర్ సెకండ్ (EPS) సామర్థ్యంతో ప్రారంభమైన వ్యవస్థ ప్రస్తుతం 32,500 EPS సామర్థ్యంతో పనిచేస్తూ రాష్ట్ర సైబర్ భద్రతను మరింత బలోపేతం చేస్తోందని వెల్లడించారు.
సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్, వెబ్ & మొబైల్ సెక్యూరిటీ ఆడిట్స్, నెట్వర్క్ సెక్యూరిటీ ఆడిట్స్, రెడ్ టీమ్ అసెస్మెంట్స్, వల్నరబిలిటీ అసెస్మెంట్ మరియు పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి అత్యాధునిక సేవలను కూడా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో బ్యాంకింగ్, ప్రైవేట్ రంగం మరియు ఇతర కీలక రంగాలకు కూడా సేవలను విస్తరించే లక్ష్యంతో APTS ముందుకు సాగుతోందన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, సైబర్ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాంకేతికత ఆధారిత పరిపాలన, డిజిటల్ భద్రత మరియు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. సూర్య తేజ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్, వెబ్ & మొబైల్ సెక్యూరిటీ ఆడిట్స్, నెట్వర్క్ సెక్యూరిటీ ఆడిట్స్, రెడ్ టీమ్ అసెస్మెంట్స్, వల్నరబిలిటీ అసెస్మెంట్ మరియు పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి అత్యాధునిక సేవలను కూడా అందిస్తున్నామని తెలిపారు.
