🕑 Published: June 06, 2026 at 05:52 AM CST
ప్రవాస భారతీయులు సుపథం మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఉన్న గడువు పరిమితిని తితిదే 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకునేందుకు వారు స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లో ఒరిజినల్ పాస్పోర్ట్, ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకుని సుపథం మార్గం వద్దకు చేరుకుంటే పాస్పోర్ట్ పరిశీలించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ను జారీ చేస్తున్నారు. అయితే, కొందరు ప్రవాస భారతీయులకు 30 రోజుల కాలపరిమితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై గడువు పెంచాలని తితిదేకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో స్పందించిన తితిదే 90 రోజులకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
