Politics

వాళ్లు బిరియానీ పెట్టారు. మేము బుల్లెట్లు పెట్టాం.

yogi says we fed bullets to terrorists

తెలంగాణలో తెరాస ప్రభుత్వం తీరు నిజాం పాలనను తలపిస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ కుట్రలను ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వకూడదని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో నిర్వహించిన భాజపా ఎన్నికల బహిరంగ సభకు ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. గతంలో రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని మూసివేశారని, రూ.5,500 కోట్లతో దానిని పునరుద్ధరించామని తెలిపారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించిందన్నారు. కాంగ్రెస్‌, తెరాస పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయని దుయ్యబట్టారు. దేశ సమగ్రతకు విఘాతం కలించే ఎంఐఎం లాంటి పార్టీలు చేస్తున్న ప్రకటనలకు ఇక్కడి తెరాస ప్రభుత్వం మద్దతుపలుకుతోందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ మన సైనికుల శక్తి ప్రదర్శనకు.. మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాల ప్రదర్శనకు అవకాశం ఇవ్వలేదు. భాజపా హయాంలోనే ఉగ్రవాదులపై మెరుపుదాడులు జరిగాయి. అంతరిక్షంలోనూ మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాం. దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి’’ అన్నారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రవాదులకు బిర్యానీలు తినిపిస్తే.. మోదీ ప్రభుత్వం వారికి బుల్లెట్లతో సమాధానమిచ్చింది’ అని యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడం మనదేశంలో ఎప్పటినుంచో ఉందని.. కానీ మత ప్రాతిపదికన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కావాలంటూ స్థానిక తెరాస, ఎంఐఎంలు దేశ భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలతోపాటు పేదరికంలో ఉన్న అగ్రకులాల వారికి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వేసే ప్రతి ఓటూ దేశ ద్రోహులకు, తీవ్రవాదులకు వేసే ఓటుగానే పరిగణించాలన్నారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే భాజపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు.