Movies

నిత్యాను రమ్మన్న రాజమౌళి

rajamouli calls nithya for rrr

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన ఎవరు?.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రను ఎవరు పోషించనున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కథానాయిక అన్వేషణలో ఉన్నట్లు టాక్‌. అయితే ఆ అవకాశం నిత్యా మేనన్‌ను వరించేలా ఉంది. ఆమెకు రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో లుక్‌ టెస్ట్‌ కోసం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోతున్నారా? లేదా మరేదైనా కీలకమైన పాత్ర కోసం జక్కన్న సంప్రదించారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.