Movies

అలా సొమ్ము చేసుకుంటున్నారు

disha pathani slams gossip media for cashing on her private life

తన వ్యక్తిగత జీవితంతో సొమ్ము చేసుకుంటున్నారంటూ పలు మీడియా వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ నటి దిశా పటానీ. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌తో.. దిశా డేటింగ్‌లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించింది లేదు కానీ పార్టీలకు, డిన్నర్‌ వేడుకలకు కలిసే వెళుతుంటారు. తన వృత్తికి సంబంధించిన విషయాలకంటే మీడియాకు వ్యక్తిగత జీవితంపైనే ఆసక్తి ఉందని దిశా తెలిపారు. ‘నా వ్యక్తిగత జీవితంతో మీడియా వర్గాలు సొమ్ము చేసుకుంటున్నాయి. నాకు ప్రొఫెషనల్‌ జీవితం ఉంది. మీడియాకు కూడా ఉంటుంది. రోజుకొక గాసిప్‌ సృష్టించడం వీలు కాదు కదా.. అందుకే ఇంకొకరి వ్యక్తిగత జీవితం గురించి ఏది పడితే అది రాసేస్తుంటారు. అయినా దీని వల్ల నాకు కలిగే నష్టం ఏమీ లేదు. నేను ఇండస్ట్రీలో పనిచేయడానికి ఉన్నాను. నా పనికి భంగం కలిగించే వార్తలు వస్తే అప్పుడు నేను బాధపడాలి. నేను నటించిన సినిమాలో నా నటన నచ్చలేదని ఎవరైనా చెబితే అది నాపై ఎంతో ప్రభావం చూపుతుంది. నాకు బాలీవుడ్‌లో ఎలాంటి స్నేహితులు లేరు. అలాంటప్పుడు నా గురించి ఇన్ని వార్తలు ఎలా బయటికి వస్తున్నాయో అర్ధంకావడంలేదు’ అని వెల్లడించారు. ప్రస్తుతం దిశా.. ‘భారత్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా.. సల్మాన్‌ సోదరి పాత్రను పోషిస్తున్నారు.