Devotional

అక్షయ తృతీయ ప్రత్యేకం

akshay tritiya history and speciality

1. అమిత ఫలదాయిని అక్షయ తృతీయ
అక్షయం… అంటే క్షయం లేనిదీ వృద్ధి చెందుతూనే ఉండేదీ అనే అర్థాలున్నాయి. అంతులేని శుభఫలితాలనిచ్చే రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈ రోజు చేసే దాన ధర్మాలైనా, పూజలూ పునస్కారాలైనా అనంత శుభాలనొసగుతాయన్నది వేదోక్తి.
భగవంతుడి కరుణ పుడమినంతా తడిపివేసే అపార జలధారలాంటిదనుకుంటే… ఈ జలం ఒక్కో చోట విశేష గుణాలు కలిగిన తీర్థమై ప్రవహిస్తుంది. ప్రతి చుక్కా గొంతు తడిపేదే అయినా తీర్థానికున్న ప్రత్యేకత వేరు. అలాగే ప్రతి రోజూ విలువైనదే అయినా కొన్ని రోజులు విశిష్టమైనవిగా పేరొందుతాయి. ఆ రోజున గతంలో జరిగిన ఉత్తమ శుభాలే ఆ పవిత్రతను తెచ్చిపెడతాయి. అలాంటి విశిష్ట పర్వదినాల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. *వైశాఖ శుద్ధ
తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. శివుడిని ప్రార్థించి కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజూ, విష్ణుమూర్తి మహాలక్ష్మిని మనువాడిన పర్వదినమూ కూడా ఇదే. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మిక. బంగారం కొనలేని వాళ్లు వెండినైనా కొనొచ్చనీ, అది కూడా వీలుపడని వాళ్లు ఉప్పు కొన్నా ఫర్వాలేదనీ చెబుతారు పెద్దలు. బియ్యం, కందిపప్పుల్లాంటి నిత్యావసరాలు కొనడమూ శుభమేనట. కాబట్టి ఎవరి స్తోమతను బట్టి వారు ఈ వేడుకను జరుపుకోవచ్చు.
*అన్నీ ఈ రోజే…
ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలూ, జపాలూ అక్షయమైన ఫలితాలనిస్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాలనిస్తాయని నారద పురాణం పేర్కొంటోంది. అందుకే ఈ శుభదినాన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుందని చెబుతారు. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు ఏ క్షణంలోనైనా శుభకార్యాలను చక్కగా చేసుకోవచ్చు. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు స్వరూపుడయిన పరశురాముడు ఈ రోజే జన్మించాడట. ద్వాపర యుగంలోనూ ఈ రోజుకి విశిష్ట స్థానముంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడి జన్మదినం అక్షయ తృతీయే. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఈ రోజే ఇచ్చాడట. తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు గుప్పెడు అటుకులు ఇచ్చినందుకే నందనందనుడు ఆయనకు
అష్టైశ్వర్యాలనూ ప్రసాదించింది కూడా ఈ పర్వదినానేనట. నీవే దిక్కంటూ రెండు చేతులూ పైకెత్తి మొక్కిన ద్రౌపదికి అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం ప్రారంభించిందీ, భగీరథుని వేడుకోలుతో శివుని జటాజూటం నుంచీ గంగ నేలను చేరిందీ ఈనాడేనట. శివుడి వాహనమైన నంది పుట్టిందీ ఈ రోజే కావడంతో ‘బసవ జయంతి’నీ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయరోజు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగతా ఏడాదంతా స్వామిని చందనపు పూతతో కప్పివేస్తారు. ప్రముఖ శైవక్షేత్రం బదరీనాథ్‌ ఆలయాన్ని చలికాలం తర్వాత ఈ రోజే తిరిగి తెరుస్తారు.
*పుణ్యప్రదం…
మహాశివుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు. అనంత ఫలితాలనొసగే మహావిష్ణువే ఈ వ్రతానికి అధినాయకుడు. దీని ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించి, అక్షతలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి. కొంతమంది ఈ రోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, బట్టలు, గంధం తదితరాలను దానం చేస్తారు. ఎండలతో మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికి కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుందన్నమాట. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సంప్రదాయమూ ఉంది. అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందంటారు. నిండు మనసుతో చేసే ప్రతి మంచిపనీ అక్షయమవ్వాలన్నదే అక్షయ తృతీయ ఇచ్చే ఆశీర్వాదం అన్నమాట!
2.ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి?
ప్రతి గృహస్థూ రోజూ తల్లిదండ్రులనూ, గురువులనూ పూజించడంతో పాటు ఒక్క అతిథికైనా ఆతిథ్యం ఇవ్వాలనీ, పశుపక్ష్యాదులకూ ఇతర జీవరాశులకు ఆహారం పెట్టాలనీ శాస్త్రం చెబుతోంది. మనం బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చీమల్లాంటి చిన్న జీవులూ, ఇతర సూక్ష్మజీవులూ దాన్ని ఆశ్రయించి ఆకలి తీర్చుకుంటాయి. ఇక ముగ్గునే రంగవల్లి అని పిలుస్తారు, రంగ అంటే వేదిక, వల్లి అంటే తీగ… లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేసే వేదికకు అలంకారం చేయడం అనేది ఈ పేరులోని అర్థం. ఊరిబయట తిరుగుతుండే భూతగణాలను వాకిట్లో నిలిపివేసే సాధనంగానూ ముగ్గును చెబుతారు. ముగ్గు ఇంటి ముందు ఉంటే దేవతాంశలు తప్ప ఇతర ఏ చెడూ లోనికి ప్రవేశించలేదంటారు. ఎవరైనా చనిపోయి కర్మలు జరుగుతున్న ఇంటితోపాటు, ఆబ్దీకం సమయంలోనూ ఇంటి ముందు ముగ్గు వేయకపోవడానికి కారణం, దానివల్ల పితృదేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి ఇబ్బంది పడతారన్న ఉద్దేశమే. అందుకే ఇంటి ముందు ముగ్గు వేయడాన్ని మంగళప్రదంగా భావిస్తారు.