Sports

పోలీసులు….కుక్క కన్నా హీనంగా చూశారు

Cricketer Sreesanth Opens Up About His Tihar Jail Experiences

భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌.. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో దాదాపు ఒక నెల పాటు జైలు శిక్ష అనుభవించాడు. థిహార్‌ జైల్‌ల్లో అతనికి జరిగిన అవమానాలను, ఇబ్బందులను గురించి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌ మాట్లాడుతూ.. థిహార్‌ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడున్న పోలీసు సిబ్బంది తనను నేరస్తుడిగా చూశారనీ, హత్య చేసి వచ్చిన నేరగాడిగా తనను చూసేవారని అతను తెలిపాడు. నోటికి వచ్చినట్లు మాటలతో వేధించేవారని అతడు గద్గద స్వరంతో తెలిపాడు. ఆ సమయంలో నేను చాలా భయానికి గురయ్యాను. కానీ, త్వరగానే తేరుకున్నానని ఈ ఫాస్ట్‌ బౌలర్‌ తెలిపాడు. జైల్లో అస్సలు నిద్ర పట్టేది కాదనీ, లైట్స్‌ ఆర్పలేకపోయేవారని తెలిపాడు. జైల్లో చాలా విధాలుగా మానసికంగా కృంగిపోయానని తెలిపాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శ్రీశాంత్‌.. అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లతో కలిసి స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసులో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీంతో శ్రీశాంత్‌ సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించగా కోర్టు అతడి శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. అతడిపై ఉన్న ఏడేళ్ల శిక్ష సెప్టెంబర్‌ 2020లో ముగుస్తుంది. 36 ఏళ్ల శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో 169 వికెట్లు తీశాడు. శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 2011లో తన చివరి మ్యాచ్‌ ఆడాడు.