Sports

మహిళను వేధించిన అండర్-23 క్రికెటర్లు

Indian Under-23 Cricketers Abuses Women

అండర్‌-23 క్రికెటర్లు ఇద్దరు ఓ మహిళ వెంటపడి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారిద్దరు జైలు ఊచలు లెక్కించకుండా తప్పించుకున్నారు! సీకే నాయుడు ట్రోఫీలో బెంగాల్‌తో మ్యాచ్‌ కోసం దిల్లీ అండర్‌-23 జట్టు కోల్‌కతాకు వచ్చింది. ఓ హోటల్‌లో బస చేసింది. క్రిస్మస్‌ సందర్భంగా ముందురోజు సాయంత్రం అక్కడ జరిగిన వేడుకలో క్రికెటర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, లక్ష్య థారెజ ఓ అమ్మాయి వెంట పడ్డారని సమాచారం. గది వరకు ఆమెను వెంబడించడమే కాకుండా లోపలికెళ్లి గడియ పెట్టుకున్నా పదేపదే తలుపుతట్టి వేధించారు! ఇబ్బందిపడ్డ ఆమె వెంటనే హోటల్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే దిల్లీ జట్టు యాజమాన్యం రంగంలోకి దిగింది. కుల్‌దీప్‌, థారెజను జట్టు నుంచి తొలగించి వేరే హోటల్‌కు పంపించింది. వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేయగానే దిల్లీ వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. అదృష్టవశాత్తు మహిళ, హోటల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకున్న దిల్లీ డైరెక్టర్‌ సంజయ్‌ భరద్వాజ్‌ కోల్‌కతాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పంజాబ్‌తో తర్వాత జరిగే రంజీ మ్యాచ్‌కు ఇషాంత్‌ స్థానంలో కుల్‌దీప్‌ ఎంపికవ్వడం గమనార్హం. ఇప్పుడు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.