Movies

పోలీసులను ఆశ్రయించిన అనసూయ

Anchor Anasuya Writes To Cyber Crime Police

తన గురించి అభ్యంతరకరంగా ట్వీట్‌ చేసిన వారిని గుర్తించాలని కోరుతూ ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని కోరారు. ‘యాక్టర్స్‌ మసాలా’ అనే పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా నుంచి గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది స్టార్స్‌కు సంబంధించిన విషయాలను అభ్యంతరకర భాషలో చర్చిస్తూ ట్వీట్లు వస్తున్నాయి. తాజాగా అగ్రకథానాయకుడు నాగార్జున, అనుష్క, అనసూయల గురించి కొన్ని అసభ్యకరమైన పదాలతో ట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్లను చూసిన అనసూయ ఆవేదనకు గురయ్యారు. ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘యాక్టర్స్‌ మసాలా’ అనే ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె కోరారు. అనసూయ పెట్టిన ట్వీట్‌పై స్పందించిన సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు.. ‘మేడమ్‌.. మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. సదరు వ్యక్తులను పట్టుకుంటాం’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించినందుకు సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.