Politics

దళిత రిజర్వేషన్లపై మోడీ మార్క్ దెబ్బ

దళిత రిజర్వేషన్లపై మోడీ మార్క్ దెబ్బ

కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దళితులు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరణ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీల లిస్ట్‌లోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. పదవులు కూడా పొందుతున్నారు. అలాంటి వారిని అనర్హులుగా పరిగణించేందుకు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉందా? అని జీవీఎల్‌ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‌మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని చెప్పారు. అయితే నామినేషన్ వేసే సమయంలో.. వారు మతం మారినట్లు పూర్తి సాక్షాధారాలతో రిటర్నింగ్‌ అధికారులకు సమాచారం ఇస్తే వారి నామినేష్లను తిరస్కరణకు గురవుతాయని చెప్పారు.

క్రైస్తవం లేదా ఇస్తాంలోకి మారిన దళితులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ రిజర్వ్‌డ్ స్థానాల నుంచి పోటీచేయడానికి అర్హత లేదు. అలాగే, రాజ్యాంగం కల్పించిన ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా వర్తించవు అని మంత్రి స్పష్టం చేశారు. ‘రాజ్యాంగంలోని 3 వ పేరా (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్‌లో ఇలా ఉంది… హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి భిన్నమైన మతాన్ని అనుసరించే ఏ వ్యక్తీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుడిగా పరిగణించరు’ అని చెప్పారు.