Fashion

ప్రైవేటు సంస్థలలో మహిళలకూ ఇక నైట్‌షిఫ్ట్‌లు

ప్రైవేటు సంస్థలలో మహిళలకూ ఇక నైట్‌షిఫ్ట్‌లు

ప్రైవేట్​ కంపెనీలు , దుకాణాల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు రాత్రి పూట విధులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సరళతర వాణిజ్య విధానం అమల్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం కార్మిక చట్టాలు మహిళ చట్టాలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే సంబంధిత సంస్థ గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

మహిళలను రాత్రి వేళ్లల్లో పనిచేసేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

దుకాణాలు, సంస్థల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పూట విధులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరళతర వాణిజ్య విధానం అమల్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అనుమతి ఇచ్చింది.

రవాణా సదుపాయం తప్పనిసరి

ఇందుకు మహిళా ఉద్యోగుల అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని, వాటికి జీపీఎస్​ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు రొటేషన్ విధానంలో అమలు చేయాలని కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు లైంగిక వేధింపుల నుంచి భద్రతా చర్యలు, కనీసం ఐదుగురు మహిళా ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని పేర్కొంది.

మహిళల రక్షణ బాధ్యత సంస్ధదే

ప్రసవానికి ముందు, తర్వాత కనీసం 16 వారాల పాటు మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు అప్పగించరాదని స్పష్టం చేసింది. రాత్రి సమయాల్లో మహిళా ఉద్యోగులకు భద్రతగా తగినంత మంది సెక్యూరిటీ గార్డులు ఉండేలా చూడాలని, అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

ఈనెల 17నుంచి అమలులోనికి

నిర్దేశించిన నిబంధనలను ఏ సంస్థ పాటించకపోయినా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, లేదా మహిళా ఉద్యోగులకు రాత్రి విధులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులను రాత్రి విధులకు అనుమతిస్తూ జారీ చేసే నోటిఫికేషన్ ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.