Business

రూ.15 వేల కోట్ల విలువైన వాటాలను అమ్మిన అదానీ.. అందుకోసమేనా?

రూ.15 వేల కోట్ల విలువైన వాటాలను అమ్మిన అదానీ.. అందుకోసమేనా?

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ రూ.15,446 కోట్ల విలువైన తన సంస్థలోకి వాటాలను విక్రయించారు. అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్స్ అనే సంస్థకు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లోని వాటాలను ఆయన అమ్మారు.

వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదానీ సంస్థలోని రూ.15,446 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్టనర్కు ఈ వాటాలను అమ్మారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ని వాటాలను జీక్యూజీ పార్టనర్స్ కు విక్రయించినట్లు అదానీ సంస్థ తెలిపింది. గురువారం సెకండరీ మార్కెట్ బ్లాక్ డీల్ ద్వారా ఈ ప్రక్రియ జరిగినట్లు పేర్కొంది.

హిండెన్ బర్గ్ నివేదికతో చిక్కుల్లో పడ్డ అదానీ.. అందులో నుంచి బయటపడేందుకు ఈ వాటాలు అమ్మినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో 2 బిలియన్ల రుణాల్ని.. అదానీ చెల్లించాల్సిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. “దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టులు, పోర్టులు కలిగి ఉన్న అదానీ కంపెనీలో.. జీక్యూజీ పెట్టుబడులు పెడుతోంది. భారత్లోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ట్రాన్స్ మిషన్, పంపిణీ కలిగిన అదానీ సంస్థ.. 2030 నాటికి దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 9 శాతం ఉత్పత్తి చేస్తుంది” అని గురువారం ఒక ప్రకటనలో అదానీ సంస్థ తెలిపింది.

అదానీ కంపెనీలలో తాము భాగం కావడంపై జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్ సీఐఓ అయిన రాజీవ్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్స్.. ఓ పెట్టుబడుల సంస్థ. దీని ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్, లండన్, సీటెల్, సిడ్నీలలో ఉన్నాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఎక్సేంజ్లో ఇది లిస్ట్ అయి ఉంది. 2023 జనవరి 31 నాటికి ఇది 92 బిలయన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది.

ఆవిరైన రూ6 లక్షల కోట్ల అదానీ సంపద..

హిండెన్బర్గ్ ఎఫెక్ట్ రూ.6 లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరైంది. ఇదే సమయంలో అదానీ తన వాటాలను అమ్మడం ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజుల క్రితం గౌతమ్ అదానీ సంపద విలువ 120 బిలియన్ డాలర్లు ఉండేది. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉండే గౌతమ్ అదానీ హిండెన్బర్గ్ ఎఫెక్ట్ 25వ స్థానానికి పడిపోయారు. చాలా ఏళ్ల తర్వాత గౌతమ్ అదానీ సంపద 50 బిలియన్ డాలర్ల దిగువకు చేరింది. సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అదానీ వ్యక్తిగత సంపద నెలరోజుల వ్యవధిలోనే ఆవిరైంది.

హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చినప్పటికీ పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థల్లో ఈ నివేదిక ఆందోళన రేకెత్తించింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. ఫలితంగా గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపదపై అది ప్రభావం చూపింది. ఈ ఏడాది ఆరంభం నుంచి గౌతమ్ అదానీ సంపదలో ఏకంగా 72 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ టాప్-500 కుబేరుల జాబితాలో ఎక్కువ మొత్తంలో సంపద కోల్పోయిన వ్యక్తిగా గౌతమ్ అదానీ నిలిచారు. ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో 85.1 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయనది 8వ స్థానం.