Health

ఫ్లూ పంజా!

ఫ్లూ పంజా!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు

హైదరాబాద్‌లోనూ భారీగా రోగులు!

ప్రతి నలుగురిలో ఒకరికి లక్షణాలు

నిరంతర దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్య

‘ హెచ్‌3 ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తింపు

చేతులు కడగండి.. మాస్క్‌లు ధరించండి

కరచాలనాలు, ఆలింగనాలు ఆపివేయండి

హెచ్చరికలు జారీ చేసిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ,: ఓ పట్టాన తగ్గని జ్వరం.. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు..! కోలుకునేందుకు సాధారణం కంటే అధిక సమయం పడుతోంది..! దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ వైర్‌సతో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తాజా కేసులకు చాలావరకు ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉప రకం ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇతర ఉప రకాలతో పోలిస్తే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువని, దీంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయని పేర్కొంది. రెండు, మూడు నెలలుగా హెచ్‌3ఎన్‌2 దేశమంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని ఐసీఎంఆర్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాస కోశ సమస్యలు ముఖ్య లక్షణాలుగా పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం/శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ వందల మంది వస్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో తమ వద్దకు పది రోజుల నుంచి భారీగా కేసులు వస్తున్నట్లు హైదరాబాద్‌ పురానా హవేలీకి చెందిన వైద్యుడు డాక్టర్‌ వాహబ్‌ జుబైర్‌ తెలిపారు. ‘‘వైరల్‌ జ్వరాలు ఎక్కువశాతం పిల్లల ద్వారా కుటుంబంలోని అందరికీ సోకుతున్నాయి’’ అని డాక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌ అనే మరో వైద్యుడు పేర్కొన్నారు.

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వద్దు: ఐఎంఏ

దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌ వాడొద్దని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సూచించింది. రోగులకు ఉన్న లక్షణాల ఆధారంగా చికిత్సను సూచించాలని వైద్యులను కోరింది. ఈ ఇన్ఫెక్షన్‌ సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లోపే తగ్గిపోతుందని, సీజనల్‌ జ్వరాలు మూడు రోజుల్లోనే తగ్గితే.. దగ్గు మాత్రం మూడు వారాల వరకూ కొనసాగుతుందని పేర్కొంది. వైరస్‌ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తల జాబితాను ఐఎంసీఆర్‌ విడుదల చేసింది.

చేయాల్సిన పనులు

చేతులను క్రమం తప్పకుండా సబ్బుతో కడగాలి. లక్షణాలు ఉన్నవారు మాస్క్‌లు ధరించాలి, కళ్లను, ముక్కును అదేపనిగా తాకడం మానుకోండి. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తాగండి. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే పారాసెట్‌మాల్‌ తీసుకోండి.

ఇవి చేయొద్దు

షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు వద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దు. స్వీయ వైద్యం తగదు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు వాడాలి. ఇతరులకు దగ్గరగా కూర్చొని ఆహారం తినకండి