NRI-NRT

ఎమిరేట్స్ లో భారీ స్థాయిలో నృత్య దినోత్సవం..

ఎమిరేట్స్ లో భారీ స్థాయిలో నృత్య దినోత్సవం..

ఉపాది కొరకు గల్ఫ్ దేశాలకు వచ్చె తెలుగు కుటుంబాలలో అనేక మందిలో నృత్య నైపుణ్యం ఉంది.

ఇటీవల అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని యు.ఏ.ఇలోని రాస్ అల్ ఖైమా నగరంలో తెలుగు ప్రవాసీ సాంస్కృతిక సంఘమైన తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో నృత్యోత్సవం (Dance Fest) ఘనంగా నిర్వహించారు. దేశంలో ప్రజాదరణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యాలు, (కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథకళి, ఒడిస్సీ, మోహినీ ఆట్టం) జానపద, గిరిజన నృత్యాలు మరియు పాశ్చాత్య, దేశీయ నృత్యాలను మేళవించి రూపొందించిన సినీ నృత్య ప్రదర్శనలు జరిగాయి.

ఈ సందర్భంగా తెలుగు తరంగిణి ప్రధాన కార్యదర్శి సత్యానంద కోకా మాట్లాడుతూ, భారతదేశం అనేక కళలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలు పుట్టాయి.క్రీ.పూ మూడవ శతాబ్దంలో భరతముని నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో కూడిన భారతదేశం భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది. శాస్త్రీయ నృత్యం అనేది అభినయం, నాట్యం కలిసి ఉండాలి అని వివరించారు.

తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వేంకట సురేష్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్ విజేతగా నిలచిన నాటు నాటు నృత్యం మన తెలుగు సినిమారంగం నుంచి రావటం మన అందరికీ గర్వకారణమని చెప్పారు. వివిధ నాట్య రీతులను ప్రదర్శిచటానికి వచ్చిన కళాకారులందరికి శుభాభినందనలు తెలిపారు.

భారతీయ కలలు, సంస్కృతులను పరిరక్షించాల్సిన భాద్యత తల్లి దండ్రుల పై వున్నదని, పిల్లలను ఆ విధాంగా తీర్చి దిద్దాలని ఆయన పిలుపునిచ్చారు

తెలుగు తరంగిణి బృందం సభలు రాజేష్ చమర్తి, శ్రీనివాసరావు చిరుతనగండ్ల, ప్రసాద్ దిరిసాల, మట్టుపాలి నాగ వెంకట కేదార్, రాఘవేంద్ర రవి, యేల్చూరి శరత్, శివానంద్ రెడ్డి, వీర, రాఘవేంద్ర, మోహన్ ముసునూరి, సమంత్ కుమార్, బ్రహ్మనాద రెడ్డి, భీమ్ శంకర్, తధితరులు సహాయ సహకారులు అందించారు.

తెలుగు తరంగిణి సభ్యురాలు మరియు వ్యాఖ్యాత సురేఖ పట్నం కార్యక్రమాన్ని ఆద్యంతం అత్యంత వుత్సహంగా నిర్వహించిన విధానం అహుతులను మంత్ర ముగ్దులను చేసింది.

దుబాయిలోని ఇన్వెస్టర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐ.జి.పి.యల్) సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికీ అన్ని ఏమిరేట్లకు చెందిన కళాభిమానులు పాల్గోన్నట్లుగా నిర్వహకులు తెలిపారు. ఫోర్లన్స్ విమల బృందం మరియు శ్రీవారి పాదాలు నాట్య కళాశాల ( హైదరాబాద్) విద్యార్థుల భరతనాట్యం, తన్మయి నాట్య కళాశాల (దుబాయ్) విద్యార్థుల కూచిపూడి నృత్యాలు, భారత్ మరియు యుఏఇలో వివిధ ఎమిరేట్స్ నుండి వచ్చిన 75 మంది నాట్య కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు నృత్య కళాశాలా , హైదరాబాదు , స్థాపకురాలు నాల్ల రమాదేవి గారిని మరియు తన్మయి నృత్య కళాశాల దుబాయ్ స్థాపకులు తాతంబొట్ల ప్రీతి సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. కరతాళ ద్వనుల మద్య శ్రీమతి నాల్ల రమాదేవి గారికి “నాట్యకళా శిరోమణి” బిరుదును ప్రధానం చేసారు.