Politics

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్..

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్..

రూ. 862 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రిగా మోడీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2020 డిసెంబర్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ 1న భవన నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం పార్లమెంట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

 

రూ. 13,500 కోట్లు విలువైన సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ కొత్త పార్లమెంట్ భవనంలో పెద్ద హాళ్లు, లైబ్రరీ, పుష్కలంగా పార్కింగ్, కమిటీ రూమ్‌లు ఉంటాయి. హాల్‌లు, కార్యాలయాలలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ బడ్జెట్ రూ. 862 కోట్లు. కొత్త నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనంలో 1,224 మంది ఎంపీలు కూర్చునే సౌకర్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టును నేరుగా పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పూరి పర్యవేక్షిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యుడీ), టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనిని నిర్వహిస్తున్నాయి.