Politics

కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్‌లో సీబీఐ అధికారులు….

కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్‌లో సీబీఐ అధికారులు….

కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌లోనే కడప ఎంపీ అవినాస్‌ రెడ్డి ఉంటున్నారు. ఈ నెల 19 నుంచి వరుసగా కర్నూల్‌లోనే ఆయన ఉంటున్నారు. దీంతో సీబీఐ అధికారులు కూడా కర్నూలులోనే మాకాం మార్చారు. మరోవైపు హాస్పిటల్‌ వద్దనే వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తివాచీలు పరుచుకుని భారీ సంఖ్యలో బైఠాయించారు. దీంతో హాస్పిటల్‌ వద్ద నిన్నటి సీన్‌ ఈ రోజు కూడా రిపీట్‌కానుంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పోలీస్‌ బలగాలు కర్నూలుకు చేరుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఈ రోజు సీబీఐ నిర్ణయం ఉండవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. విశ్వభారతి సూపర్‌ హాస్పిటల్‌ ఉన్న గాయత్రీ ఎస్టేట్‌ మొత్తంలో పలు హాస్పిటల్లు, వంద మందికి పైగా డాక్టర్ల క్లినిక్‌లు, ల్యాబ్స్‌ ఉండటంతో సెన్సిటివ్‌ ప్రాంతంగా పోలీసులు భావిస్తున్నారు.

కాగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ సోమవారం అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వస్తే.. ఆయన అనుచరులు వందల మంది వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి తరలివచ్చి ఎంపీ తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు బైఠాయించారు. తివాచీలు పరుచుకుని మరీ కూర్చుని భోజనాలూ, అల్పాహారాలూ అక్కడే చేయసాగారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకొనేందుకు వచ్చిన వైసీపీ నేతల ఆగడాలను పోలీసులతోపాటు, సీబీఐ కూడా చోద్యం చూస్తూ ఉండిపోవడం విశేషం. అరెస్టుకు సహకరించాలని జిల్లా ఎస్సీకి విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ఈ మేరకు కర్నూలులో సోమవారం రోజంతా హైడ్రామా నెలకొంది.