Politics

చట్టం దృష్టిలో రాహుల్ గాంధీ ఇంకా దోషే

చట్టం దృష్టిలో రాహుల్ గాంధీ ఇంకా దోషే

రాహుల్ గాంధీ ఇంకా చట్టం దృష్టిలో దోషే.. ఆయన పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడానికి అవకాశం కలిగేలా మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఉపకరిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ అన్నారు. దొంగలందరి ఇంటి పేరు మోడీనే ఎందుకు ఉన్నదంటూ రాహుల్ గాంధీ 2019లో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కేసు పెట్టాడు. ఈ కేసు విచారిస్తూ రాహుల్ గాంధీని దోషిగా తేల్చి, గరిష్టంగా వేసే రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది.సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని, ఒక్క రోజు తగ్గినా అతడి చట్టసభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండదని తెలిపింది. గరిష్ట శిక్ష వేస్తున్నప్పుడు అందుకు బలమైన కారణాన్ని తీర్పులో పేర్కొనాల్సి ఉంటుందని పేర్కొంది. కానీ, రాహుల్ గాంధీని దోషిగా తేల్చి శిక్ష వేసిన తీర్పులో గరిష్ట శిక్ష వేయడానికి గల కారణం తెలుపలేదని గుర్తించింది.

కారణం తెలుపకుండా గరిష్ట శిక్ష వేయడం వల్ల రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, అది వయానాడ్ ప్రజల హక్కులకు సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి, తాత్కాలికంగా ఆయన నేర నిర్దారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ న్యాయవాది, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ జఠ్మలానీ అన్నారు.సుప్రీంకోర్టు మధ్యంతర స్టే వల్ల రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరిస్తుందని, కానీ, ఆయన నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పడం లేదని మహేశ్ జఠ్మలానీ అన్నారు. చట్టం దృష్టిలో రాహుల్ గాంధీ దోషే అని వివరించారు. ఈ కేసులో తదుపరిగా సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు.సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ శిక్షనూ రద్దు చేయలేదని ఆయన స్పష్టత ఇచ్చారు. రాహుల్ గాంధీ శిక్షను సెషన్స్ కోర్టే నిలిపిందని వివరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కేవలం రాహుల్ గాంధీ కన్విక్షన్ పై స్టే ఇచ్చిందని చెప్పారు.