Business

నీరా కేఫ్ లీజుకు ఇవ్వబడును: కేసీఆర్ సర్కార్

నీరా కేఫ్ లీజుకు ఇవ్వబడును: కేసీఆర్ సర్కార్

నీరా కేఫ్‌.. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణ.. ఏకంగా రూ.16 కోట్లతో స్టార్‌ హోటల్‌ను తలపించేలా నిర్మించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ నాలుగు నెలలు నిర్వహించిందో.. లేదో.. లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడం చర్చనీయాంశమైంది. పదిహేనేళ్లు ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. నీరా కేఫ్‌ను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్సైజ్‌శాఖ కలిసి నిర్మించాయి. 2023 మేలో ప్రారంభించారు. అప్పట్నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. దాదాపు 500 మంది కూర్చునే ఏర్పాట్లున్నాయి. ఈ కేఫ్‌కు రోజూ దాదాపు వెయ్యి మందికిపైగా వస్తున్నారు. లీటర్‌ నీరాను రూ.300కు విక్రయిస్తున్నారు. గీత కార్మిక సంఘాల నుంచి నీరా కొనుగోలు, రవాణా ఖర్చు కలిపి లీటర్‌కు రూ.200కిపైగా అవుతోంది. గరిష్ఠంగా రోజుకు రూ.లక్ష వరకు లాభం వస్తోంది. అయితే, కేఫ్‌పై భారీ మొత్తాన్ని ఖర్చుచేసి.. నాలుగైదు నెలలకే లీజుకిచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. లీజు ప్రాథమిక ధర నెలకు రూ.లక్షగా ఖరారు చేసి టూరిజం కార్పొరేషన్‌ టెండర్లు పిలిచింది. మరోవైపు నీరా అమ్మే సొసైటీలు రాష్ట్రంలో ఉన్నాయని.. అలా రిజిస్టర్‌ అయిన సొసైటీలకే కేఫ్‌ లీజు పొందే అర్హత ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ వర్గాలు చెబుతున్నాయి.