Devotional

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు

నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానున్నాయి. ఈ కార్తీకమాసోత్సవాల నిర్వహణకు అధికారులు వివిధ ఏర్పాట్లు చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం, కార్తీకసోమవారాలలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, నవంబరు 26న సాయంకాలం పౌర్ణమి ఘడియలలో పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం మరియు లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించి పలు ఏర్పాట్లు చేశారు.

దర్శన ఏర్పాట్లు: కార్తీకమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీకమాసమంతా కూడా గర్భాలయ అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు. అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో అనగా శని, ఆది, సోమవారాలు మొదలైన రోజులు ( కార్తీకమాసం మొత్తం 13 రోజులు స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలిపివేశారు.ఇక కార్తీకమాస సాధారణ రోజుల్లో రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనం కల్పించబడుతుంది. భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్లో మాత్రమే పొందవలసివుంటుంది.

ఇప్పటికే నవంబరు నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా డిసెంబరు నెల టికెట్ల కోటాను నవంబరు 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచారు. టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించారు.

దేవస్థానం వెబ్సైట్ www.srisailadevasthanam.org’ ద్వారా ఆయా టికెట్లను ముందస్తుగా పొందవచ్చు. అదేవిధంగా గూగుల్ స్టోరు నందు “srisaila devasthanam” మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని కూడా టికెట్లను పొందవచ్చు.

శీఘ్రదర్శనం – అతిశీఘ్రదర్శనం టికెట్లు

రూ.150 రుసుముతో గల శీఘ్రదర్శనం ( స్వామివారి అలంకార దర్శనం మాత్రమే), రూ.300 రుసుముతో అతిశీఘ్రదర్శనం టికెట్లను ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్ లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ టికెట్లలో 30 శాతం టికెట్లు ఆన్ లైన్‌లో ఇవ్వబడగా, తక్కిన 70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇవ్వబడుతున్నాయి. కార్తీకమాసంలో ఉచిత సర్వదర్శనం కూడా యథావిధిగా కొనసాగుతుంది.

ఇతర ఆర్జితసేవలు

అమ్మవారి కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, శ్రీవల్లిదేవసేవా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, మొదలైన ఆర్జితసేవలు కొనసాగుతాయి.

అన్నప్రసాదాల వితరణ

భక్తులకు అన్నదాన భవనంలో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతాయి. రాత్రి 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది. క్యూకాంప్లెక్స్‌లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేయబడుతాయి.

పాతాళగంగవద్ద ఏర్పాట్లు

కార్తీకమాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. పాతాళగంగ వద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలలో ఆయా ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా భక్తులరద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళలను నిర్ధారించడం జరుగుతుంది.

సూచిక బోర్డుల ఏర్పాట్లు

భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పలుచోట్ల మరిన్ని సూచికబోర్డులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.