Politics

NDAలోకి కొత్త మిత్రులు-తాజావార్తలు

NDAలోకి కొత్త మిత్రులు-తాజావార్తలు

* కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తాము ప్రతిపక్షమే అనే భ్రమలో ఉందని, అందుకే బట్ట కాల్చి మీదేస్తుందని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 420 హామీలకు కేవలం రూ.57వేల కోట్లు మాత్రమే కేటాయించిందని, మహాలక్ష్మి పథకానికే రూ.50వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందన్నారు. మిగతా వాటి అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

* లాటరీ రూపంలో ఓ భారతీయుడి(Indian Man)కి జాక్‌పాట్ తగిలింది. ఉచితంగా లభించిన టికెట్‌ రూపంలో రూ.33 కోట్ల భారీ అదృష్టం వరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కేరళ(Kerala)కు చెందిన రాజీవ్‌ అరిక్కట్.. కొన్నేళ్లుగా యూఏఈ(UAE)లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్‌ గత మూడేళ్లుగా బిగ్‌ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. ‘‘బిగ్‌ టికెట్‌పై ఈసారి స్పెషల్ ఆఫర్ వచ్చింది. నేను రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాను. నాకు లాటరీ తగులుతుందని ప్రతిసారీ నమ్మకంతో ఉంటాను. ఈసారి ఆరు టికెట్లు ఉండేసరికి ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. నా భార్య, నేను కలిసి 7, 13 నంబర్‌తో ఉన్న టికెట్లు కొన్నాం. అవి నా పిల్లల పుట్టినరోజు తేదీలు’’ అని వెల్లడించారు.

* తొలుత 1988లో ప్రారంభమైన అండర్ -19 వరల్డ్‌ కప్‌ (U19 World Cup 2024) ప్రస్తుతం 15వ ఎడిషన్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోని వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తే లాభదాయకంగా ఉండదనే ఉద్దేశంతోనే బీసీసీఐ పక్కకు తప్పుకొంటోందనే విమర్శలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. తాజాగా వాటిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. ‘‘అండర్-19 ప్రపంచ కప్‌ను నిర్వహించకపోవడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేవు. ఇతర మెగా టోర్నీలు ఇక్కడ జరిగాయి. నాలుగేళ్లకొకసారి వచ్చే సీనియర్‌ వరల్డ్‌ కప్‌ల కంటే.. అండర్-19 కప్‌ జరగకపోతే నష్టమేంటో అర్థంకావడం లేదు. మనం కాకపోతే వేరే దేశాలకు నిర్వహించే అవకాశం దక్కుతోంది. అప్పుడు క్రికెట్‌ విస్తరించేందుకు వీలుంటుంది. చాలామంది ఈ టోర్నీని నిర్వహించడం వల్ల బీసీసీఐకి ఆదాయం రాదనే కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ జట్లు పాల్గొనే వరల్డ్‌ కప్‌ల వల్ల కూడా కొన్నిసార్లు ఆదాయం ఉండదు. అలాగని నిర్వహించకుండా ఉంటున్నామా? అయితే, భవిష్యత్తులో తప్పకుండా అండర్ -19 ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతుందని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించాడు.

* కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ నాశనం చేసిందని ఆరోపించారు. పదేళ్ల యూపీఏ హయాంలో ఆర్థిక వినాశనం జరిగిందని దుయ్యబట్టారు. ‘శ్వేతపత్రం’ స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దీనిపై స్పందించింది. వాస్తవాలను కప్పి పెట్టేందుకే ‘శ్వేతపత్రం’ నాటకం ఆడుతున్నారని ఆ పార్టీ దుయ్యబట్టింది.

* వీఆర్‌ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా.. సీసీఎల్ఏ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. వీఆర్ఏల అంశంపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్టపరిమితి, న్యాయవివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.

* ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆయన స్పందించారు. ఎకనమిక్‌ టైమ్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన అమిత్‌ షా.. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబ పరంగా బాగుంటుందన్న అమిత్‌ షా.. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీలో అమిత్‌షాతో సమావేశమై చర్చలు జరిపారు.

* వేతన సవరణ అంశాలపై ఉద్యోగులు, పింఛనుదారులు తమ అభిప్రాయాలను తెలపాలని పీఆర్సీ ఛైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, పింఛనుదారులు, సంఘాలు మార్చి 4 వరకు సూచనలు, వినతులు ఇవ్వాలని సూచించారు. వేతనం, డీఏ, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తదితర అంశాలపై వినతి పత్రాలను లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు. బీఆర్‌కే భవన్‌లోని పీఆర్‌సీకి పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ఇవ్వొచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో అయితే.. TSPRC.02.2023@gmail.comకి మెయిల్‌ చేయవచ్చన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z