DailyDose

ప్రణీత్‌రావు డొంక కదులుతోంది-CrimeNews-Mar 12 2024

ప్రణీత్‌రావు డొంక కదులుతోంది-CrimeNews-Mar 12 2024

* ఓ కోడ‌లు క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించింది. వృద్ధుడైన త‌న మామ‌ను చేతి క‌ర్ర‌తో చిత‌క‌బాదింది. ఈ ఘ‌ట‌న‌లో కోడ‌లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మంగ‌ళూరుకు చెందిన ప‌ద్మ‌నాభ సువ‌ర్ణ‌(87) అనే వృద్ధుడు కుల్‌శేఖ‌ర్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అయితే ప‌ద్మ‌నాభ కోడ‌లు ఉమా శంక‌రి మార్చి 9వ తేదీన అత‌నిపై దాడి చేసింది. చేతి క‌ర్ర‌తో విచ‌క్ష‌ణార‌హితంగా చిత‌క‌బాదింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎదురుకాల్పుల్లో గాయ‌ప‌డ్డ గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని అంబేద్క‌ర్ కాలేజీ స‌మీపంలో అర్ధ‌రాత్రి 1:30 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు పోలీసుల‌కు సైతం స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

* ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్‌ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐబీలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్‌ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు సహకరించని ప్రణీత్‌రావు.. అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్‌ రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్ రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు విచారణ పిలవనున్నారు. ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను టాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరుల కదలికలపై ప్రణీత్‌రావు బృందం నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించిన ప్రణీత్‌రావుకి ముందే సమాచారం తెలిసేది.. ఆ జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందిందేవాడని పోలీసులు గుర్తించారు.

* దేశంలో మరో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. ఎన్‌సీబీ, గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఎటీఎస్‌), ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ.400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను గత రాత్రి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్‌ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్‌ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించారు. దిల్లీ, పంజాబ్‌లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్‌ చేసేందుకు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే గుజరాత్‌ తీరంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇది రెండోసారి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z