NRI-NRT

IAFC Hosted Indian American Festival in Dallas

IAFC Hosted Indian American Festival in Dallas

*** ఐ.ఏ.ఎఫ్. సి ఆధ్వర్యంలో డాలస్ లో ప్రవాస భారతీయోత్సవం ఘన విజయం

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ సంస్థ అయిన ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మే 4న డాలస్ నగరంలో 3000 మందికి పైగా ఉత్సాహంగా హాజరైన ప్రవాస భారతీయుల సందడితో కన్నుల పండుగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ బారులు తీరి ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’, ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు . త్రివర్ణ పతాకపు మరియు అమెరికా పతాక రంగుల బల్లూన్లను చేతబూని అటు ఇటు పరుగులు తీయడం ఒక అద్భుతమైన దృశ్యం.

దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భారత సంగీత సాహిత్య అంశాల ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో వారు చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీవిద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేయడం పాల్గొన్న వారందరిలో ఉత్సాహాన్ని నింపింది.

అమెరికా గాట్ టాలెంట్ లో స్థానం సంపాదించిన మరియు స్పానిష్ గాట్ టాలెంట్ లో సెమీఫైనలిస్ట్ గా నిలిచిన హైదరాబాద్ కు చెందిన యువకుడు క్రాంతి కుమార్ చేసిన చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటి తో మేకు కొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతి కుమార్ కు “సాహసవీర” అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్ గా అందరినీ నవ్వించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని అంతా బోర్డు సభ్యురాలు రన్నా జానీ ఆధ్వర్యంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టెక్సస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూ.ఎస్ కాంగ్రెస్ మెంబెర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిధిగా హాజరయి తన ప్రసంగంలో అమెరికా దేశం వివిధ సంస్కృతుల విభిన్న ఆచారాల ప్రవాసీయుల నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని అమెరికా దేశ ప్రగతిలో వివిధ రంగాలలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో కొనియాడదగినన్నప్పుడు కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్ ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుండి ఒక ప్రశంసా పత్రాన్ని, అలాగే టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుండి ఒక ప్రత్యేక అభినందన పత్రాన్ని తీసుకువచ్చి చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్ మరియు మ్యాట్ షహీన్ లు పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర సెనెటర్ గా ఎన్నికైన భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులందరు ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అందరి సహకారంతో భారీ బడ్జెట్ తో కూడిన ఎన్నికల్లో నిలబడి గెలవగలగడం ముఖ్యంగా మహిళలందరూ స్ఫూర్తి గా తీసుకోని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. వాషింగ్టన్ డి.సి. లో నెలకొని ఉన్న భారత ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్ , కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ మిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జన జీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి అర్హత ఉన్న వారందరూ ఎన్నికల్లో పాల్గొంటూ తమ వాణిని ఐకమత్యంగా బలంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదు అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూ.ఎస్. కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్ మరియు సెనెటర్ టెడ్ క్రూజ్ లు ఐ.ఏ.ఎఫ్.సి తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. తమ కార్యక్రమం చివరిలో రంగురంగుల కాంతులతో అత్యంత వైభవంగా జరిగిన ఫైర్ వర్క్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ సంఘాల ప్రతినిధులకు, మీడియా వారికి బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వం తో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్ – జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించారు.