Agriculture

తెలుగు రైతులకు రుతుపవనాల శుభవార్త

2019 Monsoon Info For Telugu Farmers

తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్ 10 లేదా 11న తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షపాత హెచ్చరికలను ఎప్పటికప్పుడు జిల్లాల అధికారులకు పంపాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రుతుపవనాలు ప్రస్తుతం అండమాన్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి వున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల సమాచారాన్ని పంచుకున్న ఆయన, మరో రెండువారాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఎస్కే జోషి సూచించారు.