WorldWonders

రైలులో గర్భిణికి పురుడుపోసిన ఏపీ పోలీసులు

AP Police Delivers Baby In Train - Both Are Safe

పోలీసులు వైద్యులయ్యారు.. సకాలంలో స్పందించి ఆ అమ్మకు ప్రాణం పోశారు. తల్లీబిడ్డను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేరస్థులను భయపట్టే కాఠిన్యమే కాదు ఆపదలో ఆదుకునే కారుణ్యం కూడా ఉందని నిరూపించారు తాడిపత్రి పోలీసులు. రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పట్ల సకాలంలో స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా సాయమందించారు. అందరూ పోలీసుల సేవలను అభినందించారు. కడప నుంచి కర్నూలుకు సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వరలక్ష్మి అనే గర్భిణి ప్రయాణిస్తున్నారు. తాడిపత్రి సమీపంలోకి రాగానే ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఇది గమనించి డయల్‌ 100కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించింది. రైలు తాడిపత్రి రైల్వే స్టేషన్‌ చేరుకునేలోగా డీఎస్పీ శ్రీనివాసులు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు 15 నిమిషాల్లో సీఐ తేజోమూర్తి, ఏఎస్సై లక్ష్మి తదితరులు అంబులెన్స్‌ను తెచ్చి స్టేషన్‌కు చేరుకున్నారు. రైలులో నుంచి గర్భిణిని దించి, స్ట్రెచర్‌పై మొదటి ప్లాట్‌పామ్‌ మీదకు తెచ్చారు. అంబులెన్స్‌లోకి చేర్చి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తల్లికి పోలీసులు పండ్లు, మిఠాయిలు ఇవ్వడమే గాక చిన్నారికి జత దుస్తులు కూడా అందించారు. పోలీసుల స్పందనకు సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.