DailyDose

జియో ఉచిత వైఫై కాలింగ్-వాణిజ్యం

Jio Announces Free WiFi Calling-Telugu Business News Roundup

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా లాభాలను చవిచూశాయి. బుధవారం నష్టాలపాలైన మార్కెట్లు.. తిరిగి గురువారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం నుంచే పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 634 పాయింట్లు లాభపడి 41,452 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 190 పాయింట్లు 12,215 వద్ద ముగిసింది. తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు అంటూ ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్ బుధవారం చేసిన ట్వీట్‌తో మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.46 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ, టాటా మోటార్స్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐసీఐసీఐ షేర్లు లాభాల్లో పయనించగా.. టీసీఎస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌, బ్రిటానియా, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
* మార్కెట్లో బుల్‌ దూకుడు..! దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మంచి జోరుమీదున్నాయి. మధ్యాహ్నం 2.43 సమయానికి సెన్సెక్స్‌ 605 పాయింట్లు పెరిగి 41,422 వద్ద, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 12,206 వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా లోహ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమల షేర్ల ర్యాలీతో మార్కెట్‌ దూకుడుగా ముందుకెళ్తోంది. ఐటీ రంగ షేర్లు కూడా సానుకూలంగానే ఉన్నాయి. నిఫ్టీ ఆటో, బ్యాంకింగ్‌ సూచీలు 2శాతంకుపైగా లాభపడ్డాయి. చమురు కంపెనీలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండియాన్‌ ఆయిల్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం మధ్యలో లాభాల్లో కొనసాగుతున్నాయి.
* జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ వైఫై కాలింగ్ – ఇప్పటివరకూ తమ కస్టమర్లకు ఎన్నో ఆఫర్లు ఇచ్చిన ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో.. కొత్తగా వినియోగదారుల కోసం మరో శుభవార్తను తెలిపింది. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో కూడా దగ్గర్లోని ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.దీనికోసం అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. డేటా మాత్రమే ఖర్చవుతుంది.
* మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5ఐ ని ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో.. 6.52 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 12, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
* ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) ఈ మార్చి త్రైమాసికం నుంచి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆరేడు నెలలుగా మొండి బాకీల వసూలుకు, వ్యాపారాభివృద్ధికి తాము తీసుకున్న చర్యల ఫలితంగా లాభాల్లోకి వచ్చే సానుకూలత కనిపిస్తోందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ కరణం శేఖర్ చెప్పారు. ఆర్బీఐ నిర్దేశించిన పీసీఏ (సత్వర దిద్దుబాటు చర్యల) నుంచి బ్యాంకు బయటకు రావచ్చని అభిప్రాయపడ్డారు.
* ప్రముఖ టెలికాం కంపెనీ జియో.. వైఫై కాలింగ్ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పరీక్షల దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు జియో ప్రకటించింది. జనవరి 16 వరకు దశలవారీగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
* ప్రైవేటు రంగానికి చెందిన యస్బ్యాంక్లో వాటాల కొనుగోలుపై ఎటువంటి ఆసక్తి లేదని బుధవారం ప్రముఖ పేమెంట్ సర్వీసింగ్ యాప్ పేటీఎం పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ ఈటీనౌ పేర్కొంది. నేటి మార్కెట్లో మధ్యాహ్నం 2.45 సమయంలో పేటీఎం షేరు 2 శాతం లాభాలతో రూ.46 వద్ద ట్రేడవుతోంది.
* కంప్యూటర్ రంగ దిగ్గజం ఐబీఎం తన భారత్, దక్షిణాసియా విభాగం ఎండీగా సందీప్ పటేల్ను నియమించింది. ఆయన ప్రస్తుత ఎండీ కరణ్ బజ్వా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. దీంతో పటేల్ కంపెనీకి సంబంధించిన వ్యూహాత్మక, కార్యనిర్వాహక బాధ్యతలను చూస్తారు. ముఖ్యంగా భారత్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో కంపెనీ విక్రయాలు, మార్కెటింగ్, సర్వీస్, డెలివరి ఆపరేషన్లను ఆయన బాధ్యుడిగా వ్యవహరిస్తారు
* శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామంతో మలేషియా నుంచి ఈ కమొడిటీ దిగుమతి తగ్గిపోయే అవకాశం ఉంది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, శుద్ధి చేసిన బ్లీచ్డ్ డియోడరైజ్డ్ పామాయిల్, శుద్ధి చేసిన బ్లీచ్డ్ డియోడరైజ్డ్ పామోలిన్ దిగుమతుల విధానాన్ని ‘ఉచితం నుంచి పరిమితం’ చేసింది.
* భారత్, అమెరికాల్లో ఉన్న తొలి దశ టెక్ అంకురాలకు ఆర్థిక సహాయం చేసేందుకు మంత్రా క్యాపిటల్ 6 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అంకుర సంస్థలకు సిరీస్ ఏ ఫండింగ్ను అందించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన అంకురాలకు 5 లక్షల డాలర్ల నుంచి 20 లక్షల డాలర్ల వరకూ పెట్టుబడిని సమకూర్చనుంది. ఈ 60మిలియన్ డాలర్ల నిధిలో ఇప్పటికే 24 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు మంత్రా క్యాపిటల్ జనరల్ పార్ట్నర్ (ఇండియా) జై కృష్ణన్ బుధవారం హైదరాబాద్లో తెలిపారు
* ఆన్లైన్లో బస్సు టిక్కెట్లను అమ్మే అభిబస్.కామ్ ఇక నుంచి రైల్వే టిక్కెట్ల విక్రయించనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. నెలకు దాదాపు 50లక్షలకు పైగా వినియోగదారులకు తాము సేవలనందిస్తున్నామని, ఇప్పుడు రైల్వే టిక్కెట్లనూ బుకింగ్ చేసుకునే వీలు కల్పించడంతో మరింతమంది వినియోగదార్లను ఆకర్షించేందుకు వీలవుతుందని అభిబస్.కామ్ సీఈఓ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.