Sports

దుబాయిలో మొదట బ్యాటింగ్ చేసి కూడా ఓడిపోయారా….?

దుబాయిలో మొదట బ్యాటింగ్ చేసి కూడా ఓడిపోయారా….?

సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. తాజాగా చెన్నై, పంజాబ్‌ మ్యాచ్‌పై అదే రీతిలో స్పందించాడు. ఎట్టకేలకు ఫామ్‌ అందుకున్న షేన్‌ వాట్సన్‌ను డీజిల్‌ ఇంజిన్‌తో పోల్చిన వీరూ.. చెన్నై మ్యాచ్‌ గెలవడానికి కారణాలు వెల్లడించాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. మ్యాచ్‌ను విశ్లేషిస్తూ ఆ వీడియో సాగింది. ‘సెప్టెంబర్‌ 19 నుంచి సిద్ధంగా ఉన్న డీజిల్‌ ఇంజిన్‌ మొత్తానికి స్టార్ట్‌ అయింది. అంతేకాదు డుప్లెసిస్‌తో కలిసి పంజాబ్‌ కుర్రాళ్లను ఒక టూర్‌కు కూడా తీసుకెళ్లింది’ అని వాట్సన్‌ను ఉద్దేశిస్తూ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘18వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ ఓవర్‌లో ధోని కెప్టెన్సీ, జడేజా ఫీల్డింగ్‌ విన్యాసం, శార్దూల్‌ మెరుపుల్లాంటి బంతులు మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాయి’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. అంతేకాదు.. మ్యాచ్‌ ఓడిన పంజాబ్‌ జట్టుపై వీరూ స్పందించాడు. దుబాయ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసి కూడా పంజాబ్‌ ఓడిపోయిందని, అది ఆ జట్టుకు మాత్రమే సాధ్యమని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. గత ఐపీఎల్‌లో పంజాబ్‌కు మెంటార్‌గా పనిచేసిన సెహ్వాగ్‌ ఈసారి టోర్నీకి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లోనే మ్యాచ్‌ చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. తనదైన శైలిలో మ్యాచ్‌ విశ్లేషణ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.