Politics

పగ తీర్చుకుంటామని దేవినేని ఉమా శపథం-తాజావార్తలు

పగ తీర్చుకుంటామని దేవినేని ఉమా శపథం-తాజావార్తలు

* ముఖ్యమంత్రి ఆదేశాలతో అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెడితే తమ ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రతిపక్ష నాయకులకు సెక్యూరిటీ తొలగించి, అక్రమ కేసులతో కుట్రలు పన్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు అధైర్యపడవద్దన్నారు. రాముడు మనతో ఉన్నాడు, న్యాయం జరిగి తీరుతుందన్నారు. గురువారం నాడు రాజధాని ప్రాంతంలోని మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతు శిబిరంలో గత 387 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ…జగన్ తన పబ్బంగడుపుకొని రాజధాని విషయంలో నిలువునా మోసం చేసి మడమతిప్పాడు.387 రోజులుగా మొక్కవోని దీక్షతో రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారు.117 మంది రైతులు ఆత్మహత్యలు బలిదానాలు గుండె ఆగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా పరామర్శించిన పాపాన పోలేదు.వచ్చిన రెండేళ్ళల్లో 2లక్షల అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా తినేశారు.దీక్షలు మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు రెండు సంక్రాంతులు రెండు క్రిస్మస్ లు పూర్తి చేసుకుంటున్నాము.తప్పుడు కేసులు పెట్టారు దాడులు చేశారు. మహిళలను బాధపెట్టినా ఇంత పెద్ద ఎత్తులన మహిళలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.ముఖ్యమంత్రి ఇంటి ముదే మంత్రలు బూతులు మాట్లాడుతూ పేకాట ఆడతాం ఏం పీకుతారు అంటూ మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం అవుతుంది.ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14ఏళ్లు ముఖ్యమంత్రి 12ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టి రాక్షసంగా ఆటవికంగా పరిపాలన సాగుతుంది.ప్రభుత్వం దేవాలయలపై చేసే దుర్మార్గమైన దాడులే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడేట్టు చేస్తాయి.

* ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదైయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,171 కరోనా కేసులు కాగా వైరస్ తో 7,126 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,822 యాక్టివ్ కేసులు ఉండగా 8,74,223 మంది రికవరీ అయ్యారు.

* దేశంలో జరిగే అతిపెద్ద వేడుక గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏటా జనవరి 26న అత్యంత అట్టహాసంగా దీన్ని జరుపుకొంటాం. త్రివిధ దళాల విన్యాసాలు, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాలతో రాజ్‌పథ్‌ వేదికగా జరిగే ఈ మువ్వన్నెల పండుగకు ఏటా ఓ దేశాధినేత ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. ఈ సారి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ వేడుకలకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆయన పర్యటన అనూహ్యంగా రద్దైంది. బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ కలవరపెడుతున్న దృష్ట్యా తాను ఈ వేడుకలకు రాలేకపోతున్నట్లు తెలియజేశారు. కరోనా పరిస్థితులు, తక్కువ సమయం ఉండడంతో మరో దేశాధినేతను ఆహ్వానించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి.

* సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రేపు వెల్లడించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌ తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

* కృష్ణా జిల్లాలో ప్రస్తుత కోవిడ్ స్థితిగతులపై కలెక్టర్ ఇంతియాజ్ కీలక విషయాలను వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని..గడిచిన వారంలో ఒకటి కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవ్వడం శుభపరిణామని చెప్పారు. వ్యాక్సిన్ డ్రై రన్ వలన ఆరోగ్య శాఖ సిబ్బందికి వాక్సినేషన్‌పై పూర్తి అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రెండవ ప్రాధాన్యతగా ఫ్రెంట్ లైన్ వారియర్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మూడవ ప్రాధాన్యత కింద యాభై సంవత్సరాలు దాటినవారికి ఇస్తున్నట్లు వివరించారు.

* అత్యవసర పరిస్థితుల్లో కరోనా చికిత్సకు డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల రవాణాకు మార్గం సుగమమైంది. ఇవాళ లేదా రేపట్నుంచి కొవిడ్‌ టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రయాణికుల విమానాల్లో టీకాలను రవాణా చేస్తామన్నారు.

* ఏపీలో మతసామరస్యం కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవాదాయ, మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని చెప్పారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారన్నారు.

* సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని భావిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. టికెట్‌ ఖరారైన ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో అనుమతి ఉంటుందని.. ఇతరులకు ప్లాట్‌ఫాంపై కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్‌, హౌరా, ముంబయి, న్యూదిల్లీ, గువహటి, దానాపూర్‌, జైపూర్‌, నాగ్‌పుర్‌, నాందేడ్‌, పర్బాని, ఔరంగాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మొదలగు ప్రాంతాలకు పండగ ప్రత్యేక రైళ్లు నడుపుతామని వివరించింది.

* వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరో 17వేల కాలనీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ వచ్చేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భీమిలి-భోగాపురం మధ్య 6 లేన్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అలాగే గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

* రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భారత్‌బంద్‌ సమయంలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన కేసీఆర్‌, దిల్లీ వెళ్లిరాగానే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద భట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

* ప్రపంచంలో అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా నిలిచింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ అమెరికా, బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోడెర్నా వ్యాక్సిన్‌ రెండేళ్ల పాటు రక్షణ కలిగిస్తుందని సంస్థ సీఈఓ వెల్లడించారు. అయితే, వీటిపై పూర్తిస్థాయి విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ 94.5శాతం సమర్థత చూపించిందని మోడెర్నా ఇదివరకే ప్రకటించింది. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ తయారుచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

* కొత్త రకం కరోనా వైరస్‌తో సతమతమవుతున్న యూకేకు విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. యూకేలో కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, విమానాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. దేశంలో అతి కష్టం మీద కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. యూకేలో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలపై నిషేధం ఎత్తివేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం ఎందుకని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

* చైనాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అలీబాబాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధినేత జాక్‌మా అదృశ్యం ఆ సంస్థను ఇబ్బందుల్లో నెట్టేయగా.. తాజాగా ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టే అంశాన్ని అగ్రరాజ్యం అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలీబాబాతోపాటు ప్రముఖ సోషల్‌ మీడియా గేమింగ్‌ సంస్థ టెన్సెంట్‌ను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం కూడా ప్రచురితమైంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్‌ దేశంలో 2.5 కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్‌ బ్రాండ్‌ ఈ మైలురాయిని చేరుకున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది. స్కూటర్లకు ఆదరణకు క్షీణిస్తున్న రోజుల్లో 2001లో యాక్టివాను హోండా తీసుకొచ్చింది. గత 20 ఏళ్లుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు చేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటున్నామని హోండా తెలిపింది.

* ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా- ఉత్తర కొరియా అణు ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కిమ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘ దేశ రక్షణ సంబంధిత వ్యవహారంలో సైనిక సామర్థ్యాలు పటిష్ఠంగా ఉండాలి. దీనికోసం మనం మరింత కృషి చేయాలి’’ అని కిమ్‌ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

* కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల విషయమై పలు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 59శాతం ఈ 4 రాష్ట్రాల్లో నమోదైనవేనని తెలిపారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవారాలని ఆయన రాష్ట్రాల అధికారులకు గుర్తుచేశారు.