Editorials

CIDకు బద్ధకం జబ్బు

కృషి బ్యాంకు మోసం.. పీజీ మెడికల్‌ కుంభకోణం.. మద్దెలచెర్వు సూరి హత్య కేసు.. సీఐడీ చక్కటి పనితీరుకు మచ్చుతునకలు. అయితే ఇదంతా గతమే. తీవ్రమైన నేరాల్ని, అతి ముఖ్యమైన కేసుల్ని దర్యాప్తు చేయాలంటే ఈ సంస్థకు అప్పగించాలన్నది ఒకప్పటి మాట. ఏళ్లకు ఏళ్లు సాగదీయాలంటే సీఐడీకి కేసు అప్పగించాలన్నది నేటి మాటగా ఉందనే విమర్శలున్నాయి.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుంది. 2009లోనే గృహనిర్మాణ శాఖ విచారణలో రూ.235.9 కోట్ల అవినీతిని గుర్తించి 508 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు నిగ్గు తేల్చింది. ఈ క్రమంలోనే 150 మందిని సస్పెండ్‌ చేసి 68 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. 294 మంది మండల పరిషత్‌ అధ్యక్షులు, సర్పంచ్‌లపై 179 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత 2014 వరకు ఈ పథకం ఉండటంతో అక్రమాలూ కొనసాగాయి. అందుకే 2004-14 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు.

నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దేవరకొండ శాఖ పరిధిలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో(పీఏసీఎస్‌లలో) జరిగిన అక్రమాలపై 2015లో సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తు జీడిపాకంలా సాగుతోంది. 2009-13 కాలంలో రైతుల సహకార రుణాల్ని పక్కదారి పట్టించారనే ఫిర్యాదుపై దేవరకొండ పోలీసులు 2013 అక్టోబరు 4న కేసు నమోదు చేసి సూత్రధారులను అరెస్ట్‌ చేశారు. బ్యాంకు సీఈవో చేపట్టిన విచారణలో రూ.17.81 కోట్ల అక్రమాలు జరిగాయని అప్పట్లో గుర్తించారు. నాటి సంయుక్త కలెక్టర్‌ నిర్వహించిన విచారణలో దాదాపు రూ.25 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్లు తేలడంతో 2015లో కేసును సీఐడీకి అప్పగించారు.

బోధన్‌ కేంద్రంగా నకిలీ చలానాల కుంభకోణం జరిగినట్లు వెల్లడి కావడంతో వాణిజ్యపన్నుల శాఖ అంతర్గతంగా విచారణ చేపట్టింది. దాదాపు రూ.300 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించి 26 మంది అధికారుల్ని సస్పెండ్‌ చేసింది. నకిలీ చలానాలు సృష్టించిన వ్యాపారులపై బోధన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.50 కోట్ల మేర రాబట్టారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును 2017లో సీఐడీకి అప్పగించారు. మూడేళ్లయినా కేసు ముందుకు కదలనంటోంది. వ్యాపారుల కేవైసీ వివరాలు ఇవ్వాలంటూ ఆయా బ్యాంకులకు సీఐడీ కొద్ది రోజుల క్రితం లేఖలు రాసింది.

సీఐడీ పనితీరుపై విచారణ జరిపి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం. అది అటూఇటూ తిరిగి సీఐడీకే చేరింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కేసు వచ్చినప్పుడు దాన్ని దీనికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. దాని పనితీరును మెరుగుపర్చేలా గవర్నర్‌ ఉత్తర్వులు ఇవ్వాలి.

సుపరిపాలన వేదిక స.హ.చట్టం కింద సేకరించిన సమాచారం మేరకు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి సీఐడీ వద్ద 242 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గడిచిన ఆరేళ్లలో ఈ సంఖ్య 450కి చేరింది.
* మొత్తం సిబ్బంది 820 మంది. తెలంగాణ ఆవిర్భావం నాటికి సీఐడీ వార్షిక వ్యయం 1.63 కోట్లు. ప్రస్తుతం రూ.5 కోట్లు.
* మొత్తం 450 కేసులకుగాను దాదాపు 100 కేసుల్లో పదేళ్లయినా విచారణ పూర్తి కాలేదు. 1995లో నమోదైన ఒక కేసైతే ఏకంగా 26 ఏళ్లుగా విచారణ దశలోనే కొనసాగుతుండటం గమనార్హం. సుపరిపాలన వేదిక వారు అడిగితే కేసు నంబరు తెలియజేసినా దీనికి సంబంధించి ఇతరత్రా వివరాలను సీఐడీ వెల్లడించలేదు.