Devotional

తిరుమల మాడ వీధి అంటే ఏమిటి?

తిరుమల మాడ వీధి అంటే ఏమిటి?

తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు:
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది.ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు.శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.

1.తూర్పు మాడ వీధి:
ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు.ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.

2.దక్షిణ మాడ వీధి:
ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట. ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) ‘ఊంజల్ మండపం’ ఉంది.ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది. తిరుమల నంబి గుడి తర్వాత ‘ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.

3.పడమర మాడ వీధి:
ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం,వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.

4.ఉత్తర మాడ వీధి:
ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది.అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి ‘అచ్యుతరాయ కోనేరు’ అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.
ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది.తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం – ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.