Politics

వివేకా హత్య కేసు : సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

వివేకా హత్య కేసు : సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్ బెయిల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోట్టివేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత ముఖ్యమని పేర్కొంటూ బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ, వైఎస్‌ సునీతా వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లపైనా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఆర్టికల్‌-21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని, ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో సీబీఐకి పూర్తిస్థాయిలో సునీల్‌ సహకరించారని, ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ వాదనలు వినిపిస్తూ వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్‌ ఇవ్వరాదని కోర్టును కోరింది. ఒకవేళ బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత ముఖ్యమని పేర్కొంటూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.