Devotional

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం..

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం..

సీతమ్మను మనువాడిన రామయ్య.. భద్రాద్రిలో వైభవంగా కళ్యాణోత్సవ వేడుక


భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు