NRI-NRT

భారత పర్యటనకు బైడెన్‌ : జీ-20 సదస్సులో పాల్గొననున్న అగ్రరాజ్యాధినేత

భారత పర్యటనకు బైడెన్‌ : జీ-20 సదస్సులో పాల్గొననున్న అగ్రరాజ్యాధినేత

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత పర్యటనకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో దిల్లీ వేదికగా జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు బైడెన్‌ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్‌ లూ వెల్లడించారు. భారత్‌, అమెరికాల బంధానికి 2023 గొప్ప ఏడాది కానుందని పేర్కొన్నారు. సెప్టెంబరులో భారత్‌లో పర్యటించేందుకు అధ్యక్షుడు బైడెన్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారని డొనాల్డ్‌ లూ తెలిపారు. ‘‘ఇది చాలా గొప్ప ఏడాది. ఈ సంవత్సరం.. అమెరికా అపెక్‌కు, జపాన్‌ జీ-7కు జీ-20కి భారత్‌ నాయకత్వం వహిస్తున్నాయి. క్వాడ్‌ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం హర్షణీయం. ఇది మనకు ఎన్నో అవకాశాలను కల్పించడంతో పాటు క్వాడ్‌ కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక, జీ-20కి భారత్‌ నాయకత్వం వహించడం ప్రపంచ శ్రేయస్సుకు మరింత శక్తినిస్తుంది’’ అని ఆయన వెల్లడించారు. జీ-20 సదస్సులో భాగంగా బైడెన్‌ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్‌, జానెత్‌ యెల్లెన్‌, గినా రైమోండో కూడా భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబరులో దిల్లీలో జరిగే భారత్‌-అమెరికా ఫోరమ్‌లో మంత్రులతో పాటు పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు.