Business

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. నేటి ట్రేడింగ్ను ఒడుదొడుకులతో ప్రారంభించాయి.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. అటు కీలక రంగాల షేర్లలో అమ్మకాలు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 98 పాయింట్ల నష్టంతో 60,032 వద్ద, నిఫ్టీ (Nifty) 37 పాయింట్ల నష్టంతో 17,731 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు క్షీణించి 82.01గా కొనసాగుతోంది.

నిఫ్టీలో టీసీఎస్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటార్స్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందాల్కో, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలను చవిచూశాయి. నాస్ డాక్ దాదాపు 2శాతం కుంగిపోగా.. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.58శాతం నష్టపోయింది. అటు జపాన్ నిక్కీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఇవన్నీ దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి.