కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు పండగ సమయాల్లో మిఠాయిలు, బోనస్లు ఇవ్వడం సాధారణం. మరికొన్ని కంపెనీలైతే గిఫ్ట్లు, గిఫ్ట్ కూపన్లు అందిస్తుంటాయి. చెన్నై (Chennai)కి చెందిన ఈ కంపెనీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా కంపెనీలోని వాటాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
చెన్నైకి చెందిన ఐడియాస్2ఐటీ అనే హై-ఎండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ ఉద్యోగుల కోసం ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచన చేసింది. ఇందుకోసం ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు కంపెనీలో 33 శాతం వాటా అందిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న 40 మందికి 5 శాతం వాటా.. ఇతర ఉద్యోగులకు మిగిలిన వాటా ఇవ్వనుంది. ఈ వాటాను నియంత్రిత స్టాక్ యూనిట్ల (Restricted stock units) రూపంలో అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ తెలిపారు.
‘కంపెనీ ఎదుగుదలకు తోడుగా నిలిచిన వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలనుకున్నాం. ఈ చర్యతో వారు కేవలం సంస్థలో వాటాదారులే కాకుండా కంపెనీ విజయాల్లో నిజమైన భాగస్వాములవుతారు. మేం తలపెట్టిన ఈ కార్యక్రమం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని వివేకానందన్ అన్నారు. ఐడియాస్2ఐటీ ఇప్పటికే అనేక సార్లు తమ ఉద్యోగులకు కార్లను కానుకలుగా అందించింది. మంగళవారం కూడా 50 మంది ఉద్యోగులను ఎంపిక చేసి వారికి కార్లను అందించింది.
👉 – Please join our whatsapp channel here –