Business

సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీలపై తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని గతంలో ఈడీని హైకోర్టు ఆదేశించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్‌డీలు విడుదల చేయాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై గతంలో ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఒఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

కాగా, బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాకే ఎఫ్‌డీలు జప్తు చేశారని భారతీ సిమెంట్స్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్‌డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని భారతీ సిమెంట్స్‌ మరో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z